అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స చీఫ్తో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్దపడింది.
ఎన్నికల విధులకు సంబంధం లేని ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆ శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్పై మధ్యాహ్నం కోర్టు విచారణ ప్రారంభమయ్యింది.
ప్రభుత్వం తరుపున ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మే 27వరకూ పోలీసు అధికారులు అంతా ఈసి పరిధిలోనే ఉంటారని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల విధుల్లోకి ఇంటెలిజెన్స్ డీజి లేరన్న విషయాన్ని తెలియజేశారు. ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్స్ డిజి లేరన్న పత్రాన్ని కోర్టుకు సమర్పించాలన్నధర్మాసనం, సంబంధిత ఆధారాలతో ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా కేసు విచారణలో తమనూ చేర్చాలని వైకాపా పిటిషన్ దాఖలు చేసింది. ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని వైసిపి ధర్మాసనానికి తెలియజేసింది. వైసిపి వాదనలను తరువాత వింటామని ధర్మాసనం పేర్కొంది.
పిటిషన్పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇంటిలిజెన్స్ చీప్ ఏబి వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పిలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం బదిలీలను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయ్యింది.