రాజధాని తరలింపు విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాజధాని తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చే నెల 21 వరకూ స్టేటస్ కో పొడిగించిన సంగతి తెల్సిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజధాని తరలింపు విషయంలో సరికొత్త తలనొప్పులు మొదలయ్యాయి. రాజధాని తరలింపు కేసులో వైఎస్ జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దురుద్దేశపూర్వకంగా రాజధాని తరలింపునకు చట్టాలు చేశారని రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేసారు. రైతుల తరఫున హైకోర్టులో న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. మరి ఒకటి తర్వాత ఒకటిగా రాజధాని తరలింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ అండ్ కో దాన్నుండి ఎలా బయటపడతారో చూడాలి.