హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఐటి గ్రిడ్స్ ఎండి అశోక్కు హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒక రోజు విచారణకు పోలీసుల ముందు హజరుకావాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్టు పోలీసులకు స్వాధీనం చేయాలనీ, దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు షరతు విధించింది.
హైదరాబాదు మాదాపూర్లో ఐటి గ్రిడ్స్ సంస్థను నిర్వహిస్తున్న అశోక్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని, ఆధార్, బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, ఫోన్ నెంబర్లు తదితర వివరాలు అన్నీ అయన చోరీ చేసిన డేటాలో ఉన్నాయనీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
పోలీసులు సంస్థలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపి నివేదిక తెప్పించుకున్నారు.
ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ను నియమించింది.
అశోక్ను విచారించేందుకు సిట్ అధికారులు పలు మార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హజరుకాలేదు. అశోక్ను అదుపులోకి తీసుకొని విచారించేందుకు సిట్ అధికారులు ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేశారు. అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు.
అశోక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ నిర్వహించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఐటి గ్రిడ్ సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్కు సేవలు అందిస్తున్నది.