Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. కళాశాలకు బుర్ఖా ఎందుకు వేసుకొచ్చారు అని ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. విద్యార్ధినుల తండ్రులు, మత పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది, విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించారు.
Read More: Hijab Controversy: విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం..అధికారుల చొరవతో పరిష్కారం..
Hijab Controversy: యర్రగొండపాలెం హైస్కూల్ లో
తాజాగా ప్రకాశం జిల్లాలోనూ హిజాబ్ వివాదం చెలరేగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ హైస్కూల్ లో యాజమాన్యం ముస్లిం విద్యార్ధినులను అడ్డుకుంది. హిజాబ్ తొలగించి స్కూల్ కు రావాలని చెప్పడంతో విద్యార్ధినులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఈ విషయాన్ని మత పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు హైస్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చాలా కాలం నుండి హిజాబ్ ధరించే స్కూల్ కు వస్తున్న తమ పిల్లలను ఇప్పుడు అడ్డుకుని కొత్తగా హిజాబ్ తీసివేసి రావాలని అనడం ఏమిటని వారు ప్రశ్నించారు. స్కూల్ యాజమాన్యం తీరును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మత పెద్దల ఆందోళనతో స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో వారం రోజుల పాటు విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ విచారణ జరుగుతోంది.
సమాచారం తెలిసిన ఎస్ఐ సురేశ్, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు హైస్కూల్ ద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. దీనిపై ప్రిన్సిపాల్ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను హిజాబ్ ధరించవద్దని చెప్పలేదనీ, హజరుకు గుర్తు పట్టడం ఇబ్బందిగా ఉందని ముఖానికి ముసుగు ధరించవద్దని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. విద్యార్ధినుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా హిజాబ్ ను వివాదం చేయవద్దని అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంఇఓ ఆంజనేయులు చెప్పారు. ఈ వివాదంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.