హ్యాకర్లు సృష్టించిన పేజి; Images courtesy: Indian Express
మహాత్ముడి వర్ధంతి రోజు జాతిపిత స్మృతికి అపచారం చేసినందుకు ప్రతీకారంగా హిందూ మహాసభ వెబ్సైట్ను హ్యాకింగ్ చేశారు. హ్యాక్ అయిన వెబ్సైట్ ల్యాండింగ్ పేజిలో హిందూ మహాసభ ముర్దాబాద్ అని కనబడుతోంది. గాంధీజీ దిష్టిబొమ్మకు బొమ్మ తుపాకి గురి పెట్టిన హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండే కూడా కనబడుతుంది. టీమ్ కేరళ సైబర్ వారియర్స్ ఈ హ్యాకింగ్కు పాల్పడింది.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున బుధవారం నాడు దేశమంతా ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తుండగా హిందూ మహాసభ ఆయన హత్యను పండగ చేసుకున్నది. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్లో హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండే గాంధీజీ దిష్టిబొమ్మను బొమ్మ తుపాకీతో కాల్చినట్లు పోజు ఇచ్చారు. అనంతరం మహ్మాత్ముడిని హత్య చేసిన నాధూరామ్ గాడ్సేను వీరుడిగా కొనియాడుతూ అతని ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ వీడియో వైరల్ కాగానే పోలీసులు హడావుడిగా వెళ్లి ఆ కార్యాలయంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పాండేతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
టీమ్ కేరళ సైబర్ వారియర్స్ ఇలా హిందూ మహాసభ వెబ్సైట్ను హ్యాకింగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కేరళ వరదల బారిన పడినపుడు, గొడ్డు మాంసం తినని వారికి మాత్రమే సహాయం అందించాలని మహాసభ నాయకుడు చక్రపాణి వ్యాఖ్యానించారు. దానికి ప్రతీకారంగా కూడా వెబ్సైట్ను హ్యాక్ చేశారు.