(అనంతపురం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అసెంబ్లీలో పెద్దగా మాట్లాడింది ఏమి లేదు. కాకపోతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు చేయించి పనులు చేయించారనే పేరు ఉంది. అధికార పక్షం వైసిపిపై గానీ, సిఎం జగన్మోహనరెడ్డిపై గానీ ఎన్నికల సమయంలో తప్ప మామూలుగా అయితే విమర్శల జోలికి వెళ్లరు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ ఆయనను వ్యక్తిగతంగా కలిసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు బాలకృష్ణ తాను సిఎం జగన్ ను కలవనున్నట్లు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ ఏమిటీ వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ను కలవడం ఏమిటి అనుకుంటున్నారా? ఇందులో రాజకీయంగా పెద్ద విశేషం ఏమి లేదు.
ఎందుకు జగన్ను బాలకృష్ణ కలవాలనుకుంటున్నారంటే….
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని, అదే మాదిరిగా జిల్లాల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ కోరుతున్నారు. హిందూపురం విషయంలో తాను ఎంత దూరమైనా వెళతాననీ, అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూడా కలిసి కోరతానని బాలకృష్ణ పేర్కొన్నారు.
పనిలో పనిగా ప్రభుత్వంపై విమర్శలు
నేడు బాలకృష్ణ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి 55 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా ఉన్నాయని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శించారు. రాజధాని లేకున్నా టిడిపి హయాంలో తెలంగాణ కంటే అదాయం అధికంగా వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు బాలకృష్ణ. ప్రస్తుత కష్టకాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని బాలకృష్ణ అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?