సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ చార్జి చౌళూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురైయ్యారు. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళురు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దారుణంగా నరికాారు. మొత్తం 18 చోట్ల విచక్షణారహితంగా నరికి పరారైయ్యారు. రక్తపు మడుగులో పడిన ఆయనను స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
మాస్కులు ధరించిన అదుగురు వ్యక్తులు రెండు బైక్ లపై వచ్చారనీ, ఇద్దరు దుండగులు బైక్ పైనే ఉండగా, మిగతా ముగ్గురు రామకృష్ణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కాగా తన కుమారుడి హత్య వెనుక వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్, అయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐ ఉన్నారని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనాారాయణమ్మ ఆరోపించారు. రాజకీయ కక్షతోనే తన నాయకుడు రామకృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారని అనుమానిస్తున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులకు మధ్య ఇటీవల వివాదం జరిగిందనీ, ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన హత్యకు గురి కావడంతో అనుమానాలకు తావిస్తొందని చెబుతున్నారు. రామకృష్ణారెడ్డి మృతితో చౌళూరులో విషాదశ్చాయలు అలుముకున్నాయి. భార్య, కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉండగా వారికి సమాచారం అందించారు. రామకృష్ణారెడ్డి తల్లి, కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చౌళూరు గ్రామంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. రామకృష్ణారెడ్డి హత్యలో పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఐ, ఎస్ఐలపై అధికారులు వేటు వేశారు. సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ కరీమ్ లను వీఆర్ కు పంపినట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
మద్దెలచెరుపు సూర్యనారాయణరెడ్డి పిన్నమ్మ కుమారుడు రామకృష్ణారెడ్డి, ఆయన తాత రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే. 2010 లో హిందూపురం నుండి ఇడుపులపాయ వరకూ 180 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ వరకూ పాదయాత్ర చేశారు. కాగా పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రామకృష్ణారెడ్డి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చౌలూరులో ఆయన వర్గీయులు ఆందోళన చేపట్టారు.
దసపల్లా భూ లావాదేవీల ఆరోపణలపై భూయజమానులు, బిల్డర్లు ఇచ్చిన స్పష్టత ఇది