రాజ్యసభ పరువు మంటగలుస్తోందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు గత నెల 11న ప్రారంభమైనా నేటి వరకూ రాజ్యసభలో ఎలాంటి కార్యక్రమాలూ సాగకపోవడం పై ఆయనీ రోజు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సమావేశం కావడం, విపక్షాల నిరసనలు, ఆందోళనలతో వాయిదా పడటం తోనే ఇన్ని రోజులూ గడిచిపోయిన సంగతి తెలిసిందే. అటు లోక్ సభ కూడా వాయిదాల పర్వంతోనే నడుస్తున్నా…లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరిగింది. ఆ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అయితే ఆ బిల్లును రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఫలించలేదు.
విపక్షాలు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తీరాల్సిందేనని పట్టుబట్టడంతో సభ వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ రోజు సభలో ఉద్వేగంగా మాట్లాడారు. సభలో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని సభ సజావుగా సాగేందుకు, చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలని అన్నారు. ప్రజాసమస్యలపై సభలో చర్చిస్తామని జనం చూస్తున్నారనీ, అయితే గౌరవ సభ్యుల తీరు వల్ల సభ పరువు మంటగలుస్తున్నదని వెంకయ్యనాయుడు అన్నారు.