ఢిల్లి, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అఖిలపక్ష నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ పార్టీల తరఫున నేతలు హాజరయ్యారు.
ముందుగా హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ హోంమంత్రి నివాసానికి వెళ్లి ఏకాంతంగా సమావేశమై చర్చించారు.
హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని, ప్రభుత్వం ఇప్పటి దాకా తీసుకున్న చర్యలను, ఉగ్రవాద నిరోధానికి చేపట్టబోయే చర్యల గురించి వివరించారు.
పుల్వామా దాడిని అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
సమావేశంలో కాంగ్రెస్ నేతలు గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధ్యా, ఎన్సిపి చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బంధోపాధ్యాయ, దీరిక్ ఒబ్రియన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, బిఎస్పి నేత సతీశ్ చంద్ర మిశ్రా, ఎల్జేపి నేత రాంవిలాస్ పాస్వాన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, టిడిపి నుండి ఎంపీ రామ్మోహన్నాయుడు, టిఆర్ఎస్ నుండి ఎంపి జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోది గైర్హజరుపై పలువురు విఫక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.