ప్రస్తుతం భారత్ -చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… ఒక్కొక్కారూ ఒక్కోలా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఒకరు, చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించమని ఇంకొందరు, చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని మరికొందరు… తమ తమ దేశభక్తిని, చైనాపై ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాలపొంగులాంటిదే అని కొంతమంది చేస్తున్న విమర్శల సంగతి అటుంచితే.. దేశం మొత్తం మాత్రం చైనా చేసిన పనితో ఉడికిపోతుందనేది మాత్రం వాస్తవమే! ఈ క్రమంలో ఈ వ్యవహారంపై విభిన్నంగా స్పందించారు కర్నాటకకు చెందిన ఒక హోంగార్డ్!
ప్రస్తుతం భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ లక్ష్మణ్ మడివాళ అనే హోంగార్డ్.. రాష్ట్రపతికి ఒక లేఖ రాసాడు. అది కూడా మామూలు లేఖ కాదు… రక్తంతో రాసిన లేఖ! దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది! కర్ణాటకలోని రాయచూరు జిల్లా మస్కి ప్రాంతంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ మడివాళ… తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని రాష్ట్రపతిని కోరాడు. ఈ మేరకు వైద్యుల సలహాతో భారత్–చైనాల మధ్య యుద్ధం వస్తే.. దేశ రక్షణే కర్తవ్యంగా భావిస్తానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ రక్తంతో మూడు పేజీల లేఖను రాశారు.
కాగా… హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్… విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్ వంటి విషయాలను బోధించడంతో పాటు గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి వివరించే లక్ష్యం ఏర్పరచుకున్నాడట! మరి ఈ లేఖపై ప్రథమ పౌరుడు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి!