రఘురామకృష్ణం రాజు వర్సెస్ వైకాపా… కాదు కాదు… రఘురామకృష్ణంరాజు వర్సెస్ వెస్ట్ గోదావరి నరసాపురం పార్లెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు! ప్రస్తుతం కథ ఈ క్రమంలో మలుపుతిరిగింది.. మహా రంజుగా మారుతుంది! నిన్నటివరకూ ఆర్.ఆర్.ఆర్. పర్టీ మారాలని భావిస్తున్నాడని.. అందులో భాగంగానే సస్పెషన్స్ కి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన స్పీకర్ కి ఫిర్యాదు కూడా చేశారు! ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్. కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఒకపట్టాన్న ఎవరికీ అర్ధం కావడం లేదని అంటున్నారు గోదావరి జనాలు!
తనకు జగన్ అంటే పిచ్చి, ప్రేమ, ప్రాణం… ఆయనను వదిలి వెళ్లేది లేదు, పార్టీని వీడేది లేదు అని చెబుతుంటారు రఘురామకృష్ణం రాజు! అది ప్రెస్ మీట్ లలో!! ఇక టీవీ డిబేట్ లలోనూ, స్పెషల్ ఇంటర్వ్యూలలో నూ అయితే… ఏమిటండీ జగన్ గొప్ప.. నా బొమ్మకు కూడా వేల్యూ ఉంది.. నా బొమ్మ పెట్టుకునే నేను గెలిచాను అన్న రేంజ్ లో ప్రసంగిస్తారు. పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ వస్తే.. తిరిగి పార్టీకే షోకాజ్ నోటీస్ ఇస్తుంటారు! అయినా కానీ… పార్టీలో ఉండాలని ఉందంటారు! దయచేసి తనను జగన్ నుంచి దూరం చేయొద్దన్న రేంజ్ లో రక్తి కట్టిస్తుంటారు.
ఇక నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకరితర్వాత ఒకరు వరుసపెట్టి… ఈయనపై పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నారు. ఇలా కేసులు పెట్టినవారిలో ఆచంట ఎమ్మెల్యే, గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజులు ఉన్నారు! అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రిగారూ ఇచ్చిన ఫిర్యాదులు కాబట్టి పోలీసులు వెంటనే కేసు నమోదు చేస్తారు.. నెక్స్ట్ తంతు జరుగుతూనే ఉంటుంది!
ఇక క్లైమాక్స్ విషయానికొస్తే… రఘురామకృష్ణంరాజు పార్టీని వీడాలనుకుంటున్నారని అంటున్న ఎమ్మెల్యేలు… ఆయనపై కేసులు పెడుతున్నారు! పార్టీలోనే ఉంటాను అంటున్న ఎంపీ.. పార్టీపై హస్తినలో ఫిర్యాదులు చేస్తున్నారు! ఈ ట్రయాంగిల్ స్టోరీస్ ఎప్పటికి కడతేరుతుందనే సంగతి కాసేపు పక్కనపెడితే… అసలు ఎలా కడతేరబోతోంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది!!