సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పలువురు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా కొందరు విమర్శిస్తున్నారు. అయితే, తాజాగా ఇందులో కీలక పరిణామం సంభవించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మహిళ న్యాయవాదుల అసోసియేషన్ సీఎం జగన్ తీరును తప్పుపట్టారు.
ఆ పెద్దాయన ఏమన్నారంటే….
న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్ దిగజార్చుతున్నారని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయమని తెలిపారు. జగన్పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే.. న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందని నౌషద్ అలీ పేర్కొన్నారు. ఈ మేరకు సీజేఐ బాబ్డేకు లేఖ రాశారు. కాగా, సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ సైతం సీజేకు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పథకం ప్రకారమే జగన్ దాడులు చేస్తున్నారని ఆరోపించిన న్యాయవాది తన కేసుల్లో లబ్ధి కోసమే జగన్ ఇలాంటి లేఖలు రాస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్న తీర్పుతో.. జస్టిస్ ఎన్వీరమణపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని సుప్రీంకోర్టు లాయర్ అశ్విని లేఖలో పేర్కొన్నారు. ఫుల్ కోర్టును సమావేశపర్చి జగన్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళా లాయర్లు సైతం….
మరోవైపు సుప్రీంకోర్టు మహిళ న్యాయవాదుల అసోసియేషన్ ఏపీ సీఎం జగన్ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ లేఖ న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడింది. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడాన్ని అసోసియేషన్ ఖండించింది.
రాజుగారు కూడా…
ఇక వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పట్లాగే ఈ విషయంలోనూ స్పందించారు. సీఎం జగన్ చర్యలను సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్, ఢిల్లీ బార్ అసోసియేషన్ తప్పుబట్టాయని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగం పిటిషన్లపై సుప్రీంలో త్వరలో విచారణ జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి అక్షింతలు, మందలింపులు తప్పనిసరని రఘురామ కృష్ణంరాజు జోస్యం చెప్పారు.
మంత్రి క్లారిటీ ఇచ్చారుగా
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం న్యాయ వ్యస్థలపై పోరాటం ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్దమైన వ్యవస్థలపై సంపూర్ణమైన విశ్వాసం, గౌరవం ఉంది. ఆ దిశగానే వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసేందుకు మేనేజ్ చేసే వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. న్యాయ వ్యవస్థపై ప్రగాఢ విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది. “ అని వెల్లడించారు.