Hotel: ప్రస్తుతం అందరి చూపు విశాఖ నగరంలోని గురుద్వారా జంక్షన్లో నిర్మించబడిన స్మార్ట్ ఇన్ హోటల్ పై పడింది. ఎందుకంటే ఆ హోటల్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని హోటల్స్ మాదిరిగా కాకుండా సరికొత్త ఆలోచనలతో రూపుదిద్దారు. ఎప్పుడెప్పుడు ఆ హోటల్లో బస చేస్తమా అని అందరు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నిర్మాణం సగం వరకు పూర్తి అయింది. మరికొద్ది రోజుల్లోనే కస్టమర్లకు ఈ హోటల్ అందుబాటులోకి రానుంది. అసలు ఇంతకీ ఆ హోటల్ ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా..? ఆ హోటల్ బిల్డింగ్ మొత్తం సోలార్ ప్యానెళ్లతో నిర్మించడమే. ఎవరయినా సడన్గా బయట నుండి హోటల్ ను చూస్తే మామూలు అద్దాల్లాగా కనిపిస్తాయి. నిజానికి అవి అద్దాలు కావు అద్దాల్లా కనపడే సోలార్ ప్యానెళ్లు.
Hotel: సోలార్ ప్యానెళ్ల ద్వారా హోటల్కు కరెంటు
ఈ సోలార్ ప్యానెళ్లు హోటల్కు సరిపడా కరెంట్ను నిరంతరం సప్లై చేస్తూనే ఉంటాయి. అంటే ఈ హోటల్ కు కరెంట్ తో పనిలేదన్నమాట. సూర్యుడు రాకతో హోటల్ లో నిర్మించబడిన సోలార్ ప్యానెళ్లు హోటల్ కు కావలిసిన కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి. పర్యావరణానికి మేలు చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఇలా సోలార్ హోటల్ ఏర్పాటు చేసినట్టు హోటల్ యజమాని బాబ్జీ చెబుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. హోటల్ కు సరిపడా కరెంట్ ను వినియోగించుకోగా మిగిలిన కరెంట్ ను గవర్నమెంట్కే అమ్ముతున్నారు హోటల్ యాజమాన్యం వాళ్లు. మొత్తం ఈ హోటల్లో అయిదు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తు నుంచి భవంతి పై వరకూ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు.
రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తు
ఇక ఈ ప్యానెల్స్ రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని హోటల్ యజమాని బాబ్జి అంటున్నారు. ఎలివేషన్ కోసం నలుపురంగు అద్దాలకు బదులు.. ఈ సోలార్ ప్యానళ్లను బిగించారు. ఈ రకమైన హోటల్ నిర్మాణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేదని మొట్ట మొదటిసారిగా తామే అందుబాటులోకి తెచ్చామని హోటల్ యజమాని బాబ్జీ అంటున్నారు. ఈ హోటల్ లో ఉండే టీవీ దగ్గర నుండి లిఫ్ట్ వరకు అన్ని ఎలెక్ట్రిక్ వస్తువులు ఈ సోలార్ కరెంట్ వల్లే పనిచేస్తాయి. వీటిని ఉపయోగించడం వలన ఎలాంటి కరెంట్ బిల్లు రాదని ఆయన చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్ లకు కాస్త తక్కువ రేట్లలోనే హోటల్ గదులను అందుబాటులోకి వస్తాయని హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.