వైసీపీ లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఉపఎన్నిక జరగనున్న తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అప్పుడే తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని ప్రకటించడంపై అధికారపక్షంఫ విమర్శలు ప్రారంభించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మరణించినప్పుడు జరిగే ఉప ఎన్నికలో పోటీ పెట్టరాదన్న సాంప్రదాయానికి టిడిపి తిలోదకాలిచ్చిందని వైసీపీ వాదన ప్రారంభించింది.ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తోంది.2014 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామలో గెలిచిన తంగిరాల ప్రభాకరరావు మరణించడంతో జరిగిన ఉపఎన్నికలో వైసిపి పోటీ పెట్టలేదని పేర్కొంటోంది. అంతకుముందు అంబటి బ్రాహ్మణయ్య మరణానంతర ఉప ఎన్నికలో కూడా తమ రంగంలో లేమని చెబుతోంది.అయితే అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ తో హోరాహోరీ పోరు సలిపిన విషయాన్ని వైసిపి దాచిపెట్టటం విమర్శలకు తావిస్తోంది.నంద్యాలలో వైసిపి అభ్యర్థిగా గెలిచిన భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు ఆ తర్వాత ఆయన మరణించగా ఉప ఎన్నిక జరిగింది.
ఈ ఉప ఎన్నికలో టిడిపి భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడు భూమా బ్రహ్మానంద రెడ్డిని రంగంలోకి దింపగా వైసిపి తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీకి దిగారు. వారి మధ్య భీకర పోరు జరిగింది. అటు చంద్రబాబు ఇటు జగన్ నంద్యాలలోనే మోహరించి ఉపఎన్నిక జరిపారు.చివరకు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.అయితే ఈ విషయాన్ని వైసీపీ ప్రస్తావించకుండా తిరుపతిలో టిడిపి ఎందుకు అభ్యర్థిని నిలబెడుతోందని అడుగుతుండగా టీడీపీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి.
నంద్యాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక జరిగినప్పుడు పాత సంప్రదాయాన్ని అనుసరించి జగన్ పార్టీ పోటీకి దూరంగా ఉండకుండా బరిలోకి ఎందుకు దిగిందని వైసీపీని టీడీపీ నిలదీస్తోంది. ఈ లాజిక్ కూడా నిజమే కదా అనిపిస్తోంది అయినా ఉపఎన్నిక వస్తే షంషేర్గా పోటీ చేసి గెలిచి చూపెట్టకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందని అధికార వైసిపి బాధపడ్డమేంటి అంటున్నారు.కాగా టిడిపి తన పాత అభ్యర్థి పనబాక లక్ష్మిని మళ్లీ రంగంలోకి దించుతోంది ఆమెను గతంలో బల్లి దుర్గాప్రసాదరావు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు.