Corona Breaking: కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆస్పత్రుల్లో వైద్యులు ..సిబ్బందే కాదు. ..ఇంకో చోట కూడా ఉద్యోగులు రోజంతా పని చేస్తూనే ఉన్నారు.నిజానికి అందరికన్నా వీరి మీదే ఎక్కువ పని భారం పడింది.ఊపిరి పీల్చుకోవడానికి కూడా వారికి సమయం చిక్కడం లేదు.అలాగని వారు తమ పనిని వాయిదా వేసే అవకాశం కూడా లేదు.ఇంకా చెప్పాలంటే వారే అసలైన కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్!
ఇంతకీ వారెవరంటే!
శ్మశాన వాటికల్లో పనిచేసే ఉద్యోగుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా!దేశమంతా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా రాజధాని ఢిల్లీలో మరింత దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో బాగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి.మహారాష్ట్ర కు ఈ విషయంలో మొదటి స్థానం రాగా ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ ఇరవై వ తేదీన ఒకే రోజు ఢిల్లీలో దాదాపు ముప్పై వేల కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వేలాది కేసులు రావడంతో వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.దీంతో శ్మశాన వాటికల్లో ఉద్యోగులు డే అండ్ నైట్ పని చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.అలా చేస్తున్నా కరోనా మృతుల చితి మంటలు అరడమేలేదు.ఏ శ్మశానవాటికలో చూసినా చితిమంటలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి.
వాస్తవాలకు దర్పణం పట్టిన ఉద్యోగి మాటలు!
తాజాగా ఢిల్లీలో ఒక శ్మశాన వాటిక ఉద్యోగి తమ కష్టాలను వివరించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అతని ప్రత్యక్షానుభవాన్ని చూస్తే ఢిల్లీలో పరిస్థితి మీద ఒక అంచనా వేస్తోంది.ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ అనే శ్మశాన వాటిక ఉద్యోగి ఒకరిని ఒక మీడియా సంస్థ ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది.శ్మశాన వాటికల్లో పరిస్థితులు ఏమిటని ఆ ఉద్యోగిని ప్రశ్నించగా అతను చెప్పిన వివరాలు చూస్తే ఎవరైనా దిగ్భ్రాంతి చెందాల్సిందే!తమ శ్మశానవాటికలో రోజు లి కేవలం 31 చితులు మాత్రమే ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు ఉన్నాయని, కానీ ఇప్పుడు రోజుకు వంద మందికి నిరంతరాయంగా దహనక్రియలు నిర్వహిస్తున్నామని ఆ ఉద్యోగి చెప్పాడు.రోజంతా శ్మశానవాటిక పని చేస్తూనే ఉందని, ఇక్కడి ఉద్యోగులు సెలవులు సైతం లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆయన వాపోయాడు. కరోనా లేనప్పుడు రోజుకి ఆరు లేదా ఎనిమిది మృతదేహాలు ఈ శ్మశాన వాటికకువస్తే ఎక్కువని అతను వివరించాడు.ఇప్పుడు వంద దాకా వస్తున్నా నిరాటంకంగా పనిచేస్తున్న శవాల రాక మాత్రం ఆగడం లేదని అతను చెప్పాడు.
Read More: ICMR Guidelines: గాలి ద్వారా కరోనా వైరస్ ఎంత దూరం వ్యాపిస్తుందో తెలుసా?
మొదటిసారిగా భయం కలిగింది!
శ్మశాన వాటికలో పనిచేసే తనకు ఎప్పుడూ భయం కలగలేదని కాని ఇప్పుడు వస్తున్న మృతదేహాల రద్దీని చూశాక భయకంపితుడవుతున్నానని ఆ ఉద్యోగి చెప్పాడు.కరోనా మృతుల కుటుంబ సభ్యుల రోదనలు ,వారి కన్నీళ్లు ప్రత్యక్షంగా చూస్తున్న తనకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు.ఎంత ఒత్తిడిలో ఉద్యోగం చేయలేక మానుకుందామనుకున్నా వృత్తి ధర్మం గుర్తుకొచ్చి ఆ పని చేయలేకున్నానని చెప్పాడు.శ్మశానంలో ఇంత పని చేసి ఇంటికెళ్లాక నిద్ర రావడం లేదని ,కుటుంబ సభ్యులతో కూడా అంటీముట్టనట్టుగా ఉండాల్సి వస్తోందని అతను వాపోయాడు.మరి ఇంకెన్నాళ్లు ఇలా కరోనా చితిమంటలు దేశంలో ఎగిసిపడతాయో అర్థమేకావడంలేదు.