ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు మాటనమ్ముకుని, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుకుని, రిస్క్ చేయడం ఎందుకని భావించినట్లుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలే.. మూడు రాజధానుల విషయంలో సైలంట్ గా ఉంటుంటే… తగుదునమ్మా అంటూ గవర్నర్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ!
ఆ క్షణం నుంచి కన్నాకు కష్టాలు మొదలైపోయాయి. బయట వ్యక్తులు, వైకాపా నేతలు విమర్శిస్తున్నారంటే… బాబుకోసమో, మరిదేనికోసమో భరిచొచ్చు కానీ… పార్టీలోని నేతలే ఏకిపారేస్తుంటే… కన్నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది!
అవును… కన్నా లక్ష్మీనారాయణ “మూడు రాజధానులు వద్దు, అమరాతి ముద్దు” అన్నట్లుగా ఎపుడైతే లేఖ రాసారో ఆ మరుక్షణం బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మైకందుకున్నారు.. రాయలసీమకు న్యాయ రాజధానిని సమర్ధించారు.. సీమకు అన్యాయం చేయొద్దని చెప్పారు! ఇదే క్రమంలో… ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఒంటెద్దు పోకడల పట్ల లోలోపల రగులుతూనే ఉన్నారంట! ఇక సీమ కు ఒక రాజధాని వస్తుంటే… ఇదేమి పని అని విష్ణు వర్ధన్ లాంటి వారు కూడా ఫైరవుతున్నారని అంటున్నారు!
ఇదే క్రమంలో… హరిబాబును దించి కన్నాకు ఈ పదవి ఇవ్వడంతో, ఎప్పటినుంచో అవకాశం కోసం చూస్తున్నట్లుగా… ఉత్తరాంధ్ర పేరు చెప్పి కన్నాను ఏకేస్తున్నారంట హరిబాబు వర్గం నేతలు!! దీంతో… అనాలోచితంగానో, ఆవేశంతోనో, బాబు ప్రేమకోసమో రాసిన ఒక లేఖ.. సొంత పార్టీలోనే ఈ స్థాయిలో ఇంతమందిని దూరం చేస్తుందని కన్నా ఊహించి ఉండరని అంటున్నారు ఆయన అభిమానులు! “చేతులు ఇప్పటికే కాలిపోయాయి.. ఇప్పుడు ఆకులు పట్టుకోవడం దేనికి” కన్నా?