పీఎం కేర్స్ (ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ) పేరు విన్నారుగా? దాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ప్రారంభించారో తెలుసుగా!. కరోనా మహమ్మారి కట్టడి, సహాయక చర్యలకు వినియోగించేందుకు గానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో సదుద్దేశంతో దీన్ని ఈ ఏడాది మార్చి 26న ప్రారంభించారు. బాగానే ఉంది. దీనికి మంచి స్పందన కూడా లభిస్తున్నది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అరగంటలోనే ఐఏఎస్ అధికారుల సంఘం 21లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వగా, ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలు అందజేశారు. ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ఇలా అనేక మంది సంస్థలలో ఉద్యోగుల ఒక రోజు వేతనాలను విరాళంగా ఇచ్చారు. అనేక సంస్థలు విరాళాలు ఇస్తూనే ఉన్నాయి. దీనికి ప్రతేకంగా విదేశీ విరాళాలకు అనుమతి ఇచ్చారు. ఇటీవల కాలం వరకు దాదాపు 6500 కోట్లు వరకు పీఎం కేర్స్ కు విరాళాలు వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
అంతా బాగానే ఉందిగా ఇందులో విషయం ఏమిటి అనుకుంటున్నారా? ఉంది అది ఏమిటంటే.. పీఎం కేర్స్ ప్రారంభించినప్పుడే ప్రతిపక్షాల నుండి ఓ సందేహం వచ్చింది. దేశంలో ప్రధాన మంత్రి సహాయ నిధి అనేది ఒకటి ఉండగా ఇది ఎందుకు అని. కానీ డానికి సమాధానం లేదు. అదే విధంగా పీఎం కేర్స్ సమాచార హక్కు చట్టం పరిధికి వస్తుందా? రాదా?. దీనికి సమాధానం లేదు. ఇక పొతే పీఎం కేర్స్ విషయాలకు సంభందించి వివరాల కోసం పలువురు సామాజిక కార్యకర్తలు సమాచార హక్కు చట్టం ద్వారా పీఎంఓను కోరితే ఇంత వరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా సహాయక చర్యలు, వైద్య సేవలకు ఈ పీఎం కేర్స్ నుండి రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా దీనిపై ఎటువంటి స్పందన లేదు. ప్రజా స్వామ్యదేశంలో ప్రధాన మంత్రి చైర్మన్ గా ఉన్న పీఎం కేర్స్ పారదర్శకంగా లేకపోతే ఎలా అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే పీఎం కేర్స్ సైట్ లో మాత్రం మార్చి 31వ తేదీ వరకు 3076.62 కోట్లు వచ్చినట్లు పేర్కొంటూ అడిట్ నివేదికను ఉంచారు.
ఈ నేపథ్యంలోనే పీఎం కేర్స్ సేకరించిన విరాళాలను జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) కి మళ్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ కేసు విచారణను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేసింది. స్వచంద విరాళాల రూపంలో పీఎం కేర్స్ సహాయ నిధికి సేకరించిన ఉద్దేశం వేరని కోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్ సహాయక చర్యల కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఎన్ డీ ఆర్ ఎఫ్ కి మళ్లించే విధంగా ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.