ఆంధ్రప్రదేశ్ సరికొత్త పరిపాలన రాజధాని విశాఖపట్నంలో జరుగుతున్న వరస సంఘటనలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈరోజు విశాఖలో మరో పేలుడు సంభవించింది. పరిశ్రమలకు నిలయమైన విశాఖలో వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
విజయశ్రీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. అచ్యుతాపురం సెజ్లోని ఈ ఫార్మా కంపెనీలో భారీ పేలుడుకు అందరూ కంగారు పడ్డారు. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ అగ్నిమాపక శాఖ సిబ్బంది దగ్గరలోనే ఉండడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.
దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. పేలుడు ధాటికి రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇలా వరసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో పరిశ్రమలకు దగ్గరగా ఉంటోన్న విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.