విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిందూస్థాన్ షిప్ యార్డులో ఒక భారీ క్రేన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దారుణమైన సంఘటనలో ఆరుగురు చనిపోయారు. క్రేన్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి నష్టం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కూలిపోయిన క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు కావడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 10 ఏళ్ల కిందట ఈ క్రేన్ ను హిందూస్థాన్ షిప్ యార్డు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే దీని నిర్వహణను అవుట్ సోర్చింగ్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై ఆరా తీశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్కు, నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసారు.