YS Jagan వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఇటు కోర్టు దెబ్బలు, రాజ్యాంగ వ్యవస్థలు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గుక్క తిప్పుకోకుండా తగిలిన దెబ్బకు కనీసం మందు రాసుకుని సమయం ఇవ్వకుండానే ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తున్న వివాదాలు, న్యాయ వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థ నుంచి వస్తున్న ఆక్షేపణలు ప్రభుత్వం పనితీరును ప్రశ్నిస్తున్నాయి. పాలనలో అవగాహన లోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్రతి అంశం వివాదం అవ్వడం న్యాయపరంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం చూస్తుంటే అసలు పాలన ఎటు పోతుంది అన్న అనుమానం కూడా సామాన్యుడికి కలుగుతుంది. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అన్నింటా ప్రభుత్వం ఓడిపోతుంది. తాజాగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాల మీద వైకాపా రంగులు ఉండడానికి వీలు లేదంటూ ఎన్నికల సంఘం ఆక్షేపించింది. ప్రస్తుతం స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ రంగులు వాహనాలు ఎన్నికల నిబంధన నియమావళికి వ్యతిరేకంగా ఉన్నాయని వెంటనే ఆ వాహనాల రంగులు అన్నింటినీ మార్చాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
YS Jagan ఆయనతో రోజు ఉండేదే అనుకున్న!!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రోజు ప్రభుత్వానికి ఏదోరకంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన తీరే ఇంత. అనుకున్నప్పటికీ ఇక్కడ ఒక ముఖ్య విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. గతంలోనే హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులను వేయవద్దని, ఇప్పటికే వేసిన రంగులను పూర్తిగా తొలగించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో నానా హడావుడి చేసి గ్రామ సచివాలయాలు కనిపించిన ప్రభుత్వ కార్యాలయాల అన్నిటికీ వైకాపా మూడు రంగులు వేసిన తరువాత మళ్లీ వాటిని తొలగించేందుకు సైతం భారీగా ప్రభుత్వ ధనం వృధా అయింది. కేవలం తమ పార్టీ ప్రచారానికి ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను వాడుకోవడం పూర్తిగా నిషేధం. ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల అనేవి ప్రజల ఆస్తి. వారు చెల్లించిన పనులతో అవి నిర్మాణం అవుతాయి. అలాగే దాన్ని నిర్వహించే దానిలో పనిచేసే సిబ్బంది సైతం ప్రజాధనం తోనే వేతనాలు తీసుకుంటారు. అలాంటప్పుడు వాటి మీద ఒక పార్టీకి సంబంధించిన రంగులు వేయడం వల్ల వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ వాటిని తమ పార్టీ రంగు లోకి మార్చడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దీనిని గుర్తించే రాజ్యాంగంలో కచ్చితంగా దీనిమీద 121 షెడ్యూల్ లో పొందుపరిచారు. దానిని కనీసం పట్టించుకోకుండానే వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల మీద రంగులు వేసి మళ్లీ దాన్ని తొలగించుకునేందుకు సుమారు 400 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒక అంచనా.
** ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ వాహనాల మీద సైతం ప్రభుత్వ రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ రాజశేఖర్ రెడ్డి బొమ్మలతో కూడిన చిత్రం వైకాపా నవరత్నాలు పథకాలు దాని మీద ముద్రించి ఉన్నాయి. ఈ వాహనాలను సైతం జగన్ ప్రభుత్వం ప్రజాధనంతో నే కొనుగోలు చేసింది. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ రంగులు గుర్తులు కనిపించకుండా ఇప్పటికే గ్రామాల్లో పటిష్టమైన చర్యలను ఎన్నికల కమిషన్ తీసుకుంది. దీంతో పౌరసరఫరాల శాఖ వాహనాలను సైతం… దాని మీద ఉన్న రంగును సైతం తొలగించాలని ఆదేశించింది. సుమారు ఐదు వేల వాహనాల మీద మళ్ళీ రంగులు తొలగించి స్టిక్కర్లు వేయడానికి మరి అంత ఖర్చు అవుతుంది అన్నది ఇప్పుడు అంతుపట్టని విషయం.
ఎందుకీ హంగామా!
ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, మంచి పనుల వల్ల ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇష్టానుసారం ప్రజాధనాన్ని వృధా చేసి, పబ్లిక్ ఆస్తుల మీద పార్టీ ప్రచారం చేసుకోవాలనుకోవడం సముచితం కాదు. గతంలో టిడిపి ప్రభుత్వం సైతం ఇదే పని చేసింది. గ్రామాల్లో ఉన్న పంచాయతీలు వాటర్ ట్యాంకు లకు పసుపు రంగు పూసింది. దానిని చూసే ఇప్పుడు వైకాపా నాయకులు సైతం పోటాపోటీగా గ్రామాల్లో రంగులు వేయిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వైకాపా నాయకులు చేస్తున్న ప్రతి పని టీడీపీ నాయకులను చూసి వారి మీద కోపం మీద చేసిన పనులే అధికం. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. వారి దారిలో వీరు వెళుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు తప్పితే కొత్తగా వచ్చే ప్రచారం లేదు… పేరు అంతకన్నా లేదు.