కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతాంగం దేశ రాజధాని ఢిల్లీ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన రైతాంగం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేంద్రంతో జరిపిన పలు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. చివరిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన చర్చల్లో చట్టాలను రద్దు చేయడం కుదరదనీ, సవరణలు చేస్తామని ప్రకటించడంతో రైతు సంఘాలు ఆందోళనలు ఉదృతం చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన దేశ వ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో పేద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలనీ, ఢిల్లీ రహదారులు అన్నీ నిర్బంధించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో మరో సారి రైతన్నలు చర్చలు రావాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రకుమార్ తోమర్, రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. చట్టాల పూర్తి రద్దు చేయడం కుదరదనీ, రైతుల అనుమానాలు నివృత్తి చేస్తామని వారు ప్రకటించారు. వ్రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను రైతులు పరిశీలించాలని కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ రైతుల ఆందోళనల వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనీ, ఏయే శక్తులు ఉన్నాయో తేల్చాలని ప్రసార మాధ్యమాలను కోరడం అవివేకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద నిఘా వ్యవస్థ ఉంటుంది. దానితో ఏదైనా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులను బయట పెట్టే బాధ్యతను మీడియా చేయాలంటూ వారు విజ్ఞప్తి చేయడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
“మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి” అని కేంద్ర మంత్రులు కోరారు. సాధారణంగా పాలకపక్షాలు వివిధ సందర్భాల్లో మీడియాను ఆడిపోసుకోవడం రివాజు. కానీ ఈ సందర్భంలో కేంద్ర మంత్రులు మీడియా దర్యాప్తు ప్రతిభను పొగుడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం విడ్డూరమంటారా? కాదా? మీరే చెప్పండి.