సాధారణంగా కొంతమంది డబ్బు కోసం ఎన్నో మోసాలకు తెర తీస్తూ, అమాయక ప్రజలను మోసం చేసి కోట్లను కొల్లగొడుతున్నారు. ఇలాంటి తరహాలోనే ఓ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమ అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ఎన్నో బ్యాంకులలో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్లను కొల్లగొట్టి ఎంతో చాకచక్యంగా వారి నుంచి తప్పించుకున్నారు. అయితే వీరి పై నిఘా వేసిన పోలీసులు, వీరిని అదుపులోకి తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు తెలిపారు… పూర్తి వివరాల్లోకి వెళితే….
హైదరాబాద్ కి చెందిన పబ్బతి ప్రభాకర్ అతని భార్య పబ్బతి సరిత ఇద్దరు కలిసి తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి నగరంలోని పలు బ్యాంకులను పెద్ద ఎత్తున మోసం చేశారు. ఇళ్ల స్థలాలు, ఇంటికి రుణాలు పేరిట బ్యాంకులలో డబ్బులు తీసుకోవడమే కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులను సైతం బోల్తా కొట్టించి సుమారు 25 కోట్ల రూపాయలను పోగు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీరిపై నగరంలోని పలు స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయని ఏసిపి సురేందర్ తెలిపారు.
షాద్ నగర్ ఇండియన్ బ్యాంకులో సుమారు 5 కోట్ల 30 లక్షల రూపాయలను రుణంగా తీసుకొని మోసం చేశారు. అప్పట్లో బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రస్తుతం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభాకర్ అరెస్టు చేయడానికి సోదాలు నిర్వహించగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వీరిపై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
వీరిపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం ఉదయం పబ్బతి ప్రభాకర్, అతని భార్య సరితను అరెస్టు చేసి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ కి తరలించినట్లు స్థానిక మీడియా ద్వారా సురేందర్ తెలిపారు. అయితే ఈ దంపతులిద్దరూ ఇంకా ఏ బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు? వీరితో పాటు ఈ దోపిడీలో ఇంకా ఎవరు ఉన్నారు అన్న కోణంలో పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.