రోజులు మారుతున్నా మహిళలపై కట్నం వేధింపులు ఆగడం లేదు. అదేదో చదువుకోని వారనుకుంటే పొరపాటే. గొప్ప గొప్ప చదువులు చదివిన మహానుభావులు కూడా కట్నానికి కక్కుర్తిపడే వారున్నారు. ఇలాంటి వ్యవహారమే అనంతపురంలో వెలుగుచూసింది. అదనపు కట్నం కావాలంటూ తన భార్యను వేధింపులకు గురిచేసి కాపురానికి తీసుకెళ్లకుండా.. విడాకులిచ్చి వదిలించుకోవాలనుకుంటున్నాడు ఓ ప్రబుధ్దుడు.
వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన గాయత్రికి, ధర్మవరం పట్టణానికి చెందిన దీపక్ కుమార్ తో 2018 లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇతనికి వరకట్నంగా రూ.20 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలను కూడా పెట్టారు. దీపక్ కుమార్ ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అయితే పెళ్లైన మొదటి నుంచి కూడా అదనపు కట్నం కోసం అతను వేధించేవాడని బాధితురాలు తెలిపింది.
భర్తతో పాటు ఇంటి కుంటుంబ సభ్యులు కూడా వేధించేవారని తన గోడును వెళ్లబోసుకుంది గాయత్రి. అయితే ఈ క్రమంలో ఆమె డెలివరీ కోసం తన పుట్టింటికి పంపారు. అదే సమయంలో దీపక్ తన జాబ్ ను మానేసి గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడని తెలియడంతో గాయత్రి ఆ వ్యాపారం మానుకోమని పలు సార్లు సూచించినా ఫలితం లేకపోయిందని ఆమె ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
దీనితో పాటు ఆమెకు భర్త నుంచి కట్నం కోసం వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆమె తన గోడును వెళ్ళబోసుకుంది. వారికి పాప పుట్టినా కనీసం చూడడానికి రాకుండా అతని నుంచి మరిన్ని వేధింపులు మొదలయ్యాయని తెలిపింది. కాగా ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడని కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పుడు పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.
అయినా అతనిలో ఎటువంటి మార్పు లేకపోగ ఇటీవల తనకు విడాకులు కావాలంటూ నోటీసులు పంపాడు. దానితో గాయత్రి తన అత్తింటి వారిని సంప్రదించినా ఎలాంటి రెస్పా న్స్ లేకపోవడంతో గాయత్రి భర్త దగ్గరకు వెళ్లింది. కాని ఆమెను ఇంట్లోకి తన అత్త రానివ్వక పోవడంతో ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం తెలుసుకున్న ధర్మవరం పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.
గంజాయి వ్యాపారం చేస్తున్నాడని గాయత్రికి తెలిసిపోవడంతో భర్త మరింత ఒత్తిడి చేసి కట్నం కోసం వేధించేవాడని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భర్త బెది రించాడని ఆమె పోలీసులతో తన గోడును తెలిపింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం మళ్లీ వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని డీఎస్సీ రమాకాంత్ తెలిపారు.