Huzurabad: హుజూరాబాద్ Huzurabad లో ప్రస్తుత పరిస్థితి చూస్తే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ‘రంగస్థలంలో రాజకీయం మొదలైంది’ అనే డైలాగ్ గుర్తురాక మానదు. అవును మరి.. నెలకుపైగానే సాగిన ఈటల వ్యవహారం ఆయన బీజేపీలో చేరడంతో ముగిసి.. సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఇప్పుడక్కడ ఉప ఎన్నిక రాబోతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండానే ఎగిరింది. 2009 నుంచి 2019 వరకూ ఈటల వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఆ నియోజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోటే అయింది. ఒకరకంగా ఇది నిజమే. ఇన్నేళ్లలో ఆ నియోజకవర్గ ప్రజలతో ఈటల బాగా మమేకం అయ్యారు. మరి.. ఈ ఎన్నికతో నియోజకవర్గంలో పార్టీ బలం ఉందా.. వ్యక్తి బలం ఉందో తేలనుంది.
ఈటల ఎపిసోడ్ లో ఒకరకంగా చెప్పాలంటే.. నియోజకవర్గంలో ఈటలకే సానుభూతి వచ్చింది. ఈటల విషయంలో జరిగింది చూసి పార్టీలోని నేతలే సైలెంట్ అయిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి, సీఎం కేసీఆర్ నమ్మినబంట్లు అనదగినవారిలో అత్యంత ముఖ్యుడి పరిస్థితి ఎవరికైనా షాకిచ్చేదే. దీంతో ఒకరకంగా రాష్ట్రంలో కూడా కేసీఆర్ తీరుపై వ్యతిరేకత.. ఈటలపై సానుభూతే కనిపించిందని చెప్పాలి. అయితే.. మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపి ఎదురుదాడి చేయడం ద్వారా పరిస్థితి ఒకవైపుకే వెళ్లకుండా టీఆర్ఎస్ అధిష్టానం చూసిందని చెప్పొచ్చు. మరోవైపు.. నియోజకవర్గ నేతలు, ప్రజలు కూడా ఈటలకు మద్దతుగా నిలవడం విశేషం. దీంతో ప్రభుత్వం మరింత అలెర్టయింది.
Read More: Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?
దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అనుకోని పరిస్థితుల్లో వస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రభుత్వం కొని తెచ్చుకుంది. ఇప్పుడక్కడ టీఆర్ఎస్ గెలవాలి. దుబ్బాక ఫలితం వస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. ఈటల గెలిస్తే కేసీఆర్ కు ఎదురెళ్లే వ్యక్తిగా, బీజేపీకి రాష్ట్రంలో బలం పెరిగిందనే సంకేతాలు వస్తాయి. బీజేపీ వ్యూహాలు, ఈటల లోకల్ మానిటరింగ్, సానుభూతి.. ఈటల బలమైతే.. అధికారంలో ఉండటం, పరిస్థితులను తమకు అనుగుణంగా మలచుకోవడం టీఆర్ఎస్ కు బలం. వ్యక్తి చరిష్మానా.. పార్టీ చరిష్మానా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా? బీజేపీ ఎదుగుతోందా.. లేదా?.. అనేది ఈ ఉప ఎన్నికలో తేలనుంది. మరో దుబ్బాకా..? మరో నాగార్జున సాగరా..? హుజూరాబాద్ ప్రజలే తేల్చాలి.