ఇటీవలే బీజేపీలో చేరిన సినీ నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద పంచ్ డైలాగులు విసిరారు.తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందు ప్రారంభించింది తానే అని, ఆ తర్వాతే కేసీఆర్ ఆ ఆ లైన్ అందుకున్నారని ఆమె చెప్పారు.
అది కూడా తనకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాకపోవడంతో కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వైకుంఠ పాళి గా చేసుకొని అందలమెక్కారన్నారు.ఈ సందర్భంగా విజయశాంతి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు.తాను బీజేపీలోనే ఉంటూ తెలంగాణ కోసం ఉద్యమించానని,అయితే అప్పట్లో తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తాను బిజెపి నుండి బయటకొచ్చి తల్లితెలంగాణ పార్టీ పెట్టానని ఆమె తెలిపారు.తాను బీజేపీని వీడినందుకు అప్పట్లో చాలా బాధపడ్డానని కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని విజయశాంతి మీడియాకు చెప్పుకున్నారు.బీజేపీ తనను బాగా ఆదరించిందని,ఒకదశలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోటీకి బిజెపి అభ్యర్థిగా తననే నిలబెడతానని అగ్రనేత అద్వానీ ప్రతిపాదించారన్నారు.అయితే తెలంగాణపై ప్రేమతో సొంతపార్టీ పెట్టుకున్నానని,ఆ ఉద్యమ క్రమంలో ముందుకు వెళ్తుండగా,కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రంగంలోకి దిగారన్నారు.
అంటే తానే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కెసిఆర్ కంటే సీనియర్ని ఆని విజయశాంతి చెప్పారు.తెలంగాణలో తనకు బాగా ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తన చరిష్మా తట్టుకోలేక కుట్రతో తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టైగర్ నరేంద్రను పంపారని అన్నారు.నరేంద్ర సుమారు ఇరవై అయిదు సార్లు అడిగాక కేసీఆర్ని తాను కలుసుకున్నానని,ఇద్దరిదీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయమే కాబట్టి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశానని ఆమె తెలిపారు.కాని ఆ నిమిషం నుంచే తనపై కేసీఆర్ కుట్ర ప్రారంభించారన్నారు.టీఆర్ఎస్ లో యాక్టీవ్ గా ఉన్న తనను పార్టీలో తానొక్కడినే ఎదగాలనే స్వార్ధంతో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
ఆ తర్వాత కాంగ్రెసులో వెళ్లానని ,ఇప్పుడు బిజెపిలో చేరడం ద్వారా స్వగృహప్రవేశం చేశానని చెప్పిన విజయశాంతి కెసిఆర్ నుద్దేశించి “బాషా” సినిమాలో చెప్పిన రజనీకాంత్ చెప్పిన “చెడ్డ వారు ముందు సుఖపడతారు ఆ తర్వాత అన్నీ కష్టాలే ..మంచివారు ముందు కష్టపడతారు.. ఇక జీవితాంతం సుఖాలే” అన్న పాపులర్ డైలాగును ఆమె మీడియా సమావేశంలో వినిపించారు.తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని మొన్న దుబ్బాక ,నిన్న జీహెచ్ఎంసీ ,రేపు నాగార్జున సాగర్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయని ఆమె చెప్పారు.తెలంగాణ తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యమని అప్పట్లో టీడీపీ కాంగ్రెస్లు ఆయన వలలో పడ్డాయని,బీజేపీ ఆ కోవకు చెందిన పార్టీ కాదని,కెసిఆర్ ని ఇంటికి పంపించే వరకు నిద్రపోదని విజయశాంతి స్పష్టం చేశారు.