దేవనగిరి: కర్ణాటక ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడి కాబట్టే అణచివేయబడ్డానని, ముఖ్యమంత్రిని కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని హెచ్డీ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అడపాదడపా సీఎంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో కుమారస్వామి కూడా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం పదవిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని పలుమార్లు తేల్చిచెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
దేవనగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరమేశ్వర మాట్లాడుతూ.. ‘తాను అణచివేతకు గురవడం వల్లే సీఎం పదవిని పొందలేకపోయాను. నాకు ఇష్టం లేకపోయినా డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించా’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అంటరాని తనం కొనసాగుతోందని అన్నారు.
గతంలో కూడా పరమేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బీ బసవలింగప్ప, కేహెచ్ రంగనాథ్, ప్రస్తుత కలబురగి ఎంపీ మల్లిఖార్జున లాంటి దళిత నేతలు కూడా రాష్ట్రానికి నాయకత్వం వహించలేకపోయారని ఆయన అన్నారు. వీరందరికి సీఎం పదవిని చేపట్టే అర్హత ఉన్నప్పటికీ దళితులు కాబట్టే ఆ స్థాయికి చేరుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని దేవనగిరి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ(ఏఐవీఎం) అధ్యక్షుడు షమనూర్ శివశంకరప్ప ఇటీవల డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే కూడా ఖర్గే ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని ధీమా వ్యక్తం చేశారు.