ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కార్డ్ లెస్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని తొలిసారిగా ఎలాంటి కార్డులు లేకుండా ఈఎంఐ సదుపాయం అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీంతో ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లు తమకు నచ్చిన గ్యాడ్జెట్లు లేదా గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు. కేవలం తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాన్ కార్డు చూపించి స్టోర్స్లో వస్తువులను కొనవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న సదుపాయం వల్ల కస్టమర్లు పీవోఎస్ మెషిన్లు లేదా ఆన్లైన్లో ఈఎంఐ విధానంలో తమకు కావల్సిన ప్రొడక్ట్స్ను కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ సదుపాయం లభిస్తుంది. ఇక ఈ సదుపాయాన్ని అందించేందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్.. పైన్ ల్యాబ్స్ అనే సంస్థతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే కస్టమర్లు క్రోమా స్టోర్, రిలయన్స్ డిజిటల్, సంగీతా మొబైల్స్ తదితర స్టోర్స్తోపాటు ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వస్తువులను కొనవచ్చు.
క్యారియర్, డైకిన్, డెల్, గోద్రెజ్, హయర్, హెచ్పీ, లెనోవో, మైక్రోసాఫ్ట్, మోటోరోలా, నోకియా, ఒప్పో, పానాసోనిక్, తోషిబా, వివో, వర్ల్పూల్, ఎంఐ కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్పై ఈ సదుపాయం లభిస్తుంది. ఇందుకు గాను కస్టమర్లు ఐమొబైల్ యాప్లోని ఆఫర్స్ సెక్షన్ను సందర్శించవచ్చు. లేదా సీఎఫ్ అని టైప్ చేసి 5676766 నంబర్కు ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కూడా ఈ సౌకర్యం తమకు అందుబాటులో ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు.
ఈ సదుపాయం ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు ఎలాంటి కార్డులు అవసరం లేదు. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ప్రాసెస్ సాగుతుంది. కస్టమర్లకు రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లిమిట్ లభిస్తుంది. 3 నుంచి 15 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు.