దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు సంబంధించిన వివరాలతో ఓ రిజిస్ట్రీని ఓపెన్ చేయనున్నారు. ఈ మేరకు ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్తో కలిసి నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయనుంది. అందులో హాస్పిటళ్లలో చికిత్స పొందిన, పొందుతున్న కోవిడ్ పేషెంట్ల వివరాలు ఉంటాయి. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సదరు రిజిస్ట్రీ ఏర్పాటుకు చెందిన ప్రతిపాదనను ఇప్పటికే సెంట్రల్ ఎథిక్స్ కమిటీకి పంపింది. వారు ఆమోదిస్తే ఐసీఎంఆర్ ఆ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తుంది.
ఐసీఎంఆర్ ఏర్పాటు చేయనున్న కోవిడ్ పేషెంట్ల రిజిస్ట్రీని దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ ఇనిస్టిట్యూట్లు, హాస్పిటళ్లు పర్యవేక్షిస్తాయి. అందుకు మొత్తం 15 సంస్థల సహాయం తీసుకోనున్నారు. చండీగఢ్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఢిల్లీ, జోధ్పూర్లలో ఉన్న ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్లు, బెంగళూరులో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, పూణెలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ తదితర ఇనిస్టిట్యూట్లు, హాస్పిటళ్లు సదరు రిజిస్ట్రీని పర్యవేక్షిస్తాయి.
కోవిడ్ పేషెంట్ల వివరాలతో ఏర్పాటు చేయనున్న రిజిస్ట్రీ ద్వారా ఏయే వయస్సు ఉన్నవారికి, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఏయే మందులు పనిచేస్తున్నాయి, ఎన్ని రోజులకు కోలుకుంటున్నారు.. తదితర అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో కోవిడ్ బారిన పడ్డవారికి మరింత సమర్థవంతమైన చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది.