కాలం పరుగులో సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే, ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు పడే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇక పెళ్లి చేయడంలో పేద కుటుంబాలు ఆర్థికంగా పడే ఇబ్బందలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నిత్యం అమ్మాయిల కుటుంబాలు పడుతున్న బాధలు కనిపిస్తూనే ఉంటాయి.
అయితే, అలాంటి కుటుంబాల బాధలను తీర్చుతూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది ఓ గ్రామం. ఆడ పిల్ల పుడితే భారం అనే ఆలోచన ధోరణిని మార్చి.. లక్ష్మీదేవి తిరిగి వచ్చింది అనేలా చేసి.. ఊరిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పెళ్లిని ఆ గ్రామామే చేస్తోంది. అవునూ మీరు చదివింది నిజమే. ఈ కథేంటి అంటే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండయ్యపల్లి అనే ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ కుటుంబం వారి అమ్మాయి పెళ్లి చేయడంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారి బాధలు చూసి తట్టుకోలేని ఆ గ్రామమంతా కలిసి ఆ అమ్మాయి పెళ్లి చేశారు.
అయితే, పెళ్లి చేయడమే కాకుండా కొండయ్యపల్లి గ్రామంలో పుట్టిన ఏ ఆడ బిడ్డ ఇలా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఓ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. అదే “మా ఊరి మహాలక్ష్మీ”. దాని ద్వారా ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్ద పేరుమీద ఐదు వేల రూపాయలు వెంటనే డిపాజిట్ చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా పెళ్లి ఖర్చులు అన్ని భరించి.. పేద కుటుంబాల బాధ తీరుస్తున్నారు. దీనితో పాటు పేద కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలకు చేయూత నందిస్తోంది ఈ “మా ఊరి మహాలక్ష్మీ”.
దీని గురించి కొండయ్యపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ ఐ రేండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ గ్రామ ఆడబిడ్డలను తల్లిదండ్రులు భారం అనుకోకుడదనే ఆలోచన కార్యరూపమే మాఊరి మహా లక్ష్మీ అని చెప్పారు. దీని ద్వారా ఊరిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామనీ, దీనిని స్ఫూర్తిగా తీసుకుని కుటుంబాలు సైతం కొంత డిపాజిట్ చేస్తాయని తెలిపారు. కొంత మొత్తమే అయినప్పటికీ.. పెళ్లి సమయంలో ఇది వారికి ఆర్థిక భారం కలగకుండా అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ ఆలోచను ప్రభుత్వం కూడా తీసుకుని పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని తాము కోరుతున్నట్టు తెలిపారు. దీనితో పాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా మా ఊరి మహాలక్ష్మీ ద్వారా నిర్వహిస్తున్నారు.