అధికారం దక్కించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి.ఇది సహజం.అయితే వార్డు మెంబరు కూడా లేని ఏపీలో ఏకంగా అధికారంలోకి వచేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో వర్కవుటైనా ఒక స్కీమును ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి అమలు చేయటం ఇప్పుడు వార్తగా మారింది.ఒక ఆదివాసీ నాయకుడికి బిజెపిలో కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పవర్ గేమ్ ని కమలనాధులు ప్రారంభించారు.బీజేపీకి జార్ఖండ్, ఒడిషా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుంది. అక్కడ గిరిజనులను తమ వైపు తిప్పుకుని పొలిటికల్ గా ఎన్నో రకాలైన మ్యాజిక్కులు చేసింది. ఇక ఏపీలో కూడా అదే ప్రయోగం చేయాలనుకుంటోంది.నిజానికి ఏపీలో గిరిజనులు పూర్తిగా వైసీపీ వైపు ఉన్నారు. నాలుగు జిల్లాలు విస్తరించి ఏడు ఎస్టీ సీట్లు ఉంటే మొత్తానికి మొత్తం 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది.
2014 ఎన్నికల్లోనూ ఇందులో ఆరు వైసీపీ గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంకా చెప్పాలంటే గిరిజనులకు బాగా తెలిసిన ముఖ్యమంత్రులిద్దరే ఇద్దరు .వారు కేవలం వైఎస్సారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలను మాత్రమే గుర్తు పడతారంటే వారి గుండెల్లో ఆ ఇద్దరికీ ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక జగన్ బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి వారికి ఇంకా చేరువ అయ్యారు. నిజానికి ఈ బంధాన్ని వేరు చేయడం కష్టమే కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోగం చేస్తోంది.ఇందులో భాగంగా విశాఖ జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లోకుల గాంధీ ని ఇపుడు బీజేపీ ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసింది. అంటే ఏజెన్సీలో ఇంత స్థాయిలో జాతీయ పార్టీలో పదవి పొందిన వారు లేరు.
ఆ విధంగా ఆయన్ని ఫోకస్ చేసి ఏజెన్సీ ఓట్ల వేటకు బీజేపీ రెడీ అవుతోంది. ఇక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఆదీవాసీలతో ఎపుడూ టచ్ లో ఉంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారి బాగోగులు చూడడం ద్వారా చేరువ అవుతూ ఉంటారు. ఇపుడు ఇదే మంత్రంతో ఏజెన్సీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. అయితే బిజెపి ప్రయత్నం వెంట్రుకతో ముడివేసి కొండను కిందకు దింపాలనట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి.ఆదివాసీల గుండెల్లో జగన్ ముద్రను చెరిపేయడం జరిగే పని కాదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు మరి బిజెపి లెక్కలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో తేలుతుంది.