కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడెనిమిది నెలల పాటు సినిమా పరిశ్రమ స్తంభించిపోయి షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ నెల నుంచి మళ్ళీ సినిమాలన్ని షూటింగ్స్ తో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఆగిపోయిన వెంకటేష్ ’నారప్ప‘ సినిమా షూటింగ్ కూడా గత నెల ప్రారంభించారు. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా ప్రియమణి నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శ్రీకాంత్ అడ్డాల సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ కంప్లీటయింది. కాగా ప్రస్తుతం నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుగుతున్న నారప్ప డిసెంబర్ వరకు ఫినిష్ చేస్తారట. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఎఫ్ 3 లో నటించడానికి రెడీ అవుతాడని సమాచారం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా రూపొందబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది.
అయితే వెంకటేష్ కోసం ఎప్పటి నుంచో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వేయిటింగ్ లో ఉన్నాడు. పెళ్ళి చూపులు సూపర్ హిట్ తర్వాత తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ నగరానికి ఏమైంది? చేశాడు. ఆ సమయంలోనే సురేష్ ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సినిమా వెంకటేష్ తో చేయాలని కథ కూడా రెడీ చేసుకున్నాడు. కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది.
దాంతో ఆ కథ పక్కన పెట్టి మరో కథ సిద్దం చేసి వెంకటేష్ – సురేష్ బాబు లకి వినిపించాడట. ఇద్దరికి ఈ కథ నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే వెంకటేష్ తో ఎఫ్ 3 సీక్వెల్ కంప్లీట్ చేసి అనిల్ రావిపూడి పక్కకు తప్పుకుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తరుణ్ భాస్కర్ లైన్ లోకి వస్తాడని అంటున్నారు. 20201 ద్వితీయార్థం లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట.