మాజీమంత్రి ,టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి! ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా ఆయన టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
మూటాముల్లె కూడా సర్దుకున్నారు. ఈ లోపు అనుకోని పరిణామం చోటు చేసుకుంది.ఆయన సొంత మేనల్లుడు మీద భూ కబ్జా కేసు విశాఖ పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. దాంతో ఇపుడు గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా చిక్కుల్లో పడ్డారు.గంటా బృందం భూముల దందా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి మీద చంద్రబాబు సిట్ విచారణ జరిపించారు, కానీ నివేదికబయటపెట్టలేదు, ఇక జగన్ సైతం కొత్తగా సిట్ వేశారు, దాని సంగతీ ఏమీ తెలలేదు.
ఈ నేపధ్యంలో గంటా హయాంలో జరిగిన భూదందాల గురించి అంతా మరచిపోయారనుకుంటున్న వేళ సడెన్ గా గంటా సొంత మేనల్లుడి మీదనే తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో గంటా శ్రీనివాసరావు శిబిరం చిక్కుల్లో పడినట్లు అయింది. గంటా శ్రీనివాసరావు వైసిపి లోకి రావడాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయనకు మద్దతుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెద్ద స్కెచ్ వేసి గంటా గ్యాంగ్ ను పట్టించారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తద్వారా గంటా శ్రీనివాస్ వైసిపి చేరికను వారు అడ్డుకున్నారని భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే విశాఖ సిటీకి గుండె కాయలా మారుతున్న మధురవాడలో 1991లో నాటి ప్రభుత్వం వికలాంగుల కోసం పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలో వారు ఇళ్ళు కట్టుకోలేదు, దాంతో ఆ భూములు అలా పడి ఉన్నాయి.వాటి మీద కన్ను పడిన గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆయన మంత్రిగా ఉన్నపుడు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ తమ భూములుగా రాయించుకున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దాని మీదవికలాంగ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో డొంక అంతా కదిలింది. ఈ కేసులో ఏకంగా గంటా శ్రీనివాసరావు మేనల్లుడు విజయ్ బాబు ఉండడమే ఇపుడు గంటాకు ఇబ్బందిగా మారింది. గంటా మేనల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఇపుడు గంటా బ్యాచ్ కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది.
ఇంకాస్త వెనక్కు పెడితే జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రధానంగా గంటా శ్రీనివాస రావు ని టార్గెట్ చేశారు. తాను అధికారంలోకి వస్తే గంటా శ్రీనివాసరావు భూదందాలను బయటపెడతానని కూడా జగన్ ప్రకటించారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ ఆయనను పార్టీలోకి తీసుకోవాలని చేర్చుకోవాలని యోచించారు. ఈలోపే అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పారు. దీంతో గంటా వైసీపీలో చేరికకు బ్రేక్ పడిందని భావిస్తున్నారు.