ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో టీ కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు బట్టి చూస్తే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు మొత్తం కుప్పకూలిపోయింది అని చాలా మంది చెప్పటం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గాని తెలంగాణలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధికారంలో కి రాలేదు. దీనంతటికి కారణం పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే అని చాలామంది చెబుతుంటారు.
పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు తమ స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నాశనం చేశారని పార్టీ కేడర్ లో టాక్ ఎప్పటి నుండో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో, ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టాలి అనే దాని విషయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ద్వారా పార్టీలో సీనియర్ నాయకుల దగ్గర అభిప్రాయాలు తీసుకుని దాన్ని ఓ నివేదిక ఆధారంగా చేసుకుని పీసీసీ పదవి ప్రకటించడానికి రెడీ అవుతుంది. ఇటువంటి తరుణంలో పీసీసీ పదవి కచ్చితంగా రేవంత్ రెడ్డికి వస్తుందని టాక్ గట్టిగా వస్తున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెడితే పార్టీ నుండి ఫస్ట్ బయటకు వెళ్ళేది నేనే అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నేను మాత్రమే కాక చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోతారని వి హనుమంత రావు పేర్కొన్నారు. పార్టీకోసం ఎప్పటినుండో పనిచేసిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి పనికిరారా అంటూ ఎదురు ప్రశ్నించారు. అంత మాత్రమే కాక సోనియా అదేవిధంగా రాహుల్ గాంధీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.