Konda Vishweshwar Reddy: తెలంగాణ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్యసంచలనం రేపుతోంది. అత్యంత సంపన్నుడు,తెలంగాణలో అతిపెద్ద రాజకీయ కుటుంబ వారసుడు,అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అల్లుడు అయిన విశ్వేశ్వరరెడ్డి బడా పారిశ్రామికవేత్త.రాజకీయాల్లో ప్రవేశించి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన విశ్వేశ్వరరెడ్డి 2018 ఎన్నికల నాటికి ఆ పార్టీకి దూరమయ్యారు.
గులాబీ పార్టీ అధినేతలపై అనేక ఆరోపణలు చేసి ఆయన ఆ గూటినుండి బయటకొచ్చారు.తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే కాంగ్రెస్ లో కూడా ఇమడలేక ఈ ఏడాది మార్చి పదిహేనో తేదీన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.కొన్నాళ్లు వ్యాపారాలపై దృష్టి సారించాక తన తదుపరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటానని అప్పట్లో ఆయన చెప్పారు.
ఈటలతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు యత్నాలు!
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాలను విశ్వేశ్వరరెడ్డి చేశారని చెబుతారు.అప్పటికి టీఆర్ఎస్ లోనే ఈటల ఉన్నప్పటికీ ఆనాటికే కెసిఆర్ ,రాజేందర్ ల మధ్య సంబంధాలు బెడిశాయి.ఎప్పుడైనా ఈటలను కెసిఆర్ ఇంటికి పంపే సూచనలు గోచరించాయి.దీంతో విశ్వేశ్వర్ రెడ్డి ,ఈటల మంతనాలు సాగించారని సమాచారం.అయితే తదుపరి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. ఈటల పదవి కోల్పోయారు. వెంటనే ఆయన అటూ ఇటూ తిరిగి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.విశ్వేశ్వర రెడ్డి మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు.అదే పార్టీతో సంబంధం లేకుండా ఉప ఎన్నికలో ఈటల గెలుపు కోసం తాను కృషి చేస్తానని విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు.అయితే ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది
టీఆర్ఎస్ లోకి మళ్లీ వెళ్తా ..అయితే?
తాను ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి తనకు అభ్యంతరమేమీ లేదని, కాకుంటే పార్టీ పగ్గాలను హరీశ్ రావుకి ఇవ్వాలని ఆయన కండిషన్ పెట్టారు. కేసీఆర్, కేటీఆర్ కలసి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్లో కట్టుబానిసత్వం కొనసాగుతోందని అన్నారు. తండ్రీ, కొడుకులను ఎదిరించే వారిని అణచివేస్తు న్నారని విమర్శించారు.దీనిపై టీఆర్ఎస్ లో కూడా అంతర్గత చర్చనడుస్తోందని ఆయన పేర్కొన్నారు.ఎప్పుడోఒకప్పుడు ఆపార్టీ లో విస్ఫోటనం సంభవించవచ్చునన్నారు.కానీ హరీష్ రావు కి పార్టీ సారధ్యం అప్పగిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని,అప్పుడు తాను కూడా ఆ పార్టీలో వెళ్లిపోతానని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ఈ మెలిక తిరుగుడు మాటలకు అర్థం ఏమిటో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.