కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో మన దేశవ్యాప్తంగా కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సెస్ మూతబడటంతో నిర్మాతలు అందుకు ప్రత్యామ్నయంగా సినిమాలు రిలీజ్ చేసేందుకు విభిన్నమైన ఆలోచనలని చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా థియోటర్స్ మూత పడటంతో సినీ ప్రియులు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. వారికి కావాల్సింది వినోదం. అది ఎక్కడైతే ఏంటీ అన్న ఆలోచనకి వచ్చేశారు.
ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్, జీ 5, ఆహా, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్ .. వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలవుతోన్న సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నిటిని ప్రేక్షకులు మిస్ కావడం లేదు. ఇదే అదును చూసుకొని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త ఫ్లాట్ ఫార్మ్ క్రియోట్ చేసి ఎప్పటిలాగే సంచలనం సృష్ఠించాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ అవసరం లేదంటూ ‘ఏటీటీ’ అంటే ‘ఎనీ టైం థియేటర్’ ని ప్రారంభించాడు.
అయితే వర్మ ఆలోచన అద్భుతమనే చెప్పాలి. ఓటీటీకి.. ఏటీటీకి తేడా ఉంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని నెల లేదంటే సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చే సినిమాలన్నిటిని చూసే సౌలభ్యం ఉంటుంది. అయితే ఏటీటీలో మాత్రం ప్రతి సినిమాకు డబ్బులు కట్టి చూడాల్సిందే. ఒక రకంగా సినిమా చూడాలన్న ప్రతీసారి టికెట్ కొన్నట్టే లెక్క. ఈ పద్దతిలోనే రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ ‘నగ్నం’ సినిమాను ఏటీటీలో రిలీజ్ చేసి భారీగా లాభాలు పొందాడు. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ ఈటీ సంస్థ కూడా వర్మతో కలిసింది. ఈ నేపథ్యంలో మరో నిర్మాత రామసత్యనారాయణ కూడా ఈ ఏటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ‘భీమవరం టాకీస్’ పేరిట ఏటీటీ ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి సినిమాలను విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజ కూడా ఇదే ఆలోచన చేస్తున్నాడట. ఆన్లైన్ థియేటర్ క్రియేట్ చేసి సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాపారంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఏటీటీ లు మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి సినిమాలు 500 రూపాయలు టికెట్ పెట్టి ఆన్లైన్ లో రిలీజ్ చేసినా చూస్తారని స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఏటీటీ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. ఇది గనక పూర్తి స్థాయిలో సక్సస్ అయితే ఇండస్ట్రీ మొత్తం రామ్ గోపాల్ వర్మ ని నెత్తి మీద పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు.