ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఎస్ఈసీ ఎవరి పంతం వారు నెగ్గించుకునేందుకు వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతుండటం ఆందోళనకరమేనంటున్నారు మేధావులు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఈ పోరు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తరువాతే పదవీ విరమణ కావాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు జరపకూడదన్న పట్టుదలతో ఏ పి ప్రభుత్వం ఉంది. ఎన్నికలు అడ్డుకోవడానికి గానూ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కారణంగా చెబుతోంది. వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకూ ఎన్నికలు జరగకూడదని చెబుతోంది. పలు మార్పు ఎన్నికలు ఇప్పట్లో వద్దని ఎస్ఈసీకి ప్రభుత్వం లేఖలు రాసినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రభుత్వాన్ని కాదని ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినా ఎన్నికల ప్రక్రియకు అధికార యంత్రాంగం సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫిరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గైర్హజరు అవ్వడమే కాక కలెక్టర్ లు ఇతర ఎన్నికలకు సంబంధించిన అధికారులు పాల్గొనలేదు. మరో పక్క ఉద్యోగ సంఘాలు కూడా వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశాయి. అయితే ఎన్నికల విధులను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలను ఎస్ఈసీ హెచ్చరించినా వారు ఆ హెచ్చరికలు భయపడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ లు సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నపరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వ, ఉద్యోగుల సహాయ నిరాకరణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గవర్నర్ అపాయిట్మెంట్ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజ్ భవన్ నుండి ఇంత వరకూ అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరం ఇంకా ముదిరితే రాజ్యాంగ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి పరిపాలన దిశగా వెళుతుందనే వారు ఉన్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదంటున్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున పరిస్థితులు అక్కడి రావని అంటున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి.