దేవుడా..నా అమ్మను మాకిచ్చేయ్..మా అమ్మ లేకుండా మేం ఉండలేం..మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అని దేవుడిని వేడుకుంటూ తల్లి మృతదేహం వద్ద పిల్లలు ఇరవై అయిదు రోజులుగా ప్రార్థనలు చేస్తున్న ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఇలా ప్రార్థనలు చేస్తే చనిపోయిన తమ అమ్మ బతికి వస్తుందన్న ఆశతో అభం శుభం తెలియని పిల్లలు 25 రోజులుగా తల్లి మృతదేహం వద్దే కూర్చుని ఉండిపోయారు.
అసలేం జరిగిందంటే?
చెన్నైలోని టీ.నగర్లోని దిండుగల్ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర పోలీసు కంట్రోల్రూంలో పనిచేసేది. భర్తను విడిచి తన పిల్లలతోపాటు అక్క వాసుకి..వారి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సుదర్శనంతో కలిసి ఉండేది. ఈ క్రమంలో అన్నై ఇందిర గత డిసెంబర్ 7న అనారోగ్యంతో మృతి చెందింది. మెడికల్ లీవులో ఉన్న ఇందిర సెలవులు ముగిసినా డ్యూటీకి రాకపోవటం..పైగా ఎటువంటి సమాచారం అందించకపోవటంతో గురువారం ఇద్దరు మహిళా పోలీసులు ఇందిర ఇంటికి వెళ్లి చూశారు.ఆ సమయంలో ఇంటిలోని ఓ గది తలుపులు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కవడం వారి వంతయింది.ఇందిర మృతదేహం తెల్లటి వస్త్రాలతో చుట్టి ఉంది. అక్కడే ఇందిర పిల్లలతో కలిసి మరో ఇద్దరు ప్రార్థనలు చేస్తు కనిపించారు. దీంతో వారిని పోలీసులు విచారించగా..ప్రార్థనలు చేస్తే ఇందిర బతుకుతుందని ఓ పాస్టర్ చెప్పాడని అందుకే పిల్లలతో కలిసి గత 25 రోజులుగా మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తు ఉండిపోయామని వాసుకి, సుదర్శనం తెలిపారు.అయితే చనిపోయిన ఆమె బ్రతికి రావటం జరగదనీ..అది సాధ్యం కాదని నచ్చచెప్పటానికి యత్నించారు. కానీ వాళ్లు ఎంతకూ వినకపోవటంతో పసివాళ్లతో కలిసి ప్రార్థనలు చేస్తున్న వాసుకి సుదర్శనం లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవాళ్లు బ్రతికిరారనీ..ఆ విషయాన్ని చిన్నారులకు తెలియజేయాలి తప్ప ఇలా వాళ్లను మభ్య పెట్టటం సరికాదని వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చారు.అదే సమయంలో ఇందిర మరణ కారణాలపై కూడా విచారణ జరుపుతున్నారు.చెన్నై పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.