కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది.. మరి ఆ టెక్నాలజీకి సౌరశక్తిని తోడైతే..? మానవ రహిత పడవను రూపొందించవచ్చు అంటున్నారు.. ఐఐటీ మద్రాస్ నిపుణులు..! ఆ సంగతులు ఏంటో తెలుసుకుందామా మరి..!
బస్సులు, రైళ్లు, కార్లు.. ఇలా ఎన్నో ప్రయాణ సాధనాలు. వీటన్నింటికీ ఏదో ఒక రూపంలో ఇంధనం అవసరం. ఇవన్నీ కాలుష్యాన్ని భారీ స్థాయిలో వెదజల్లేవే. ఇవే కాదు… నీటిపై ప్రయాణించే వాహనాలకు కూడా ఎక్కువ స్థాయిలోనే ఫుయెల్ అవసరమవుతుంది. వాటివల్ల మారుమూల ప్రాంతాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. అందుకే కనీసం వాటర్ ట్రాన్స్పోర్ట్కైనా ఇంధన అవసరాలు తగ్గే విధంగా మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పరిశోధకులు హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే కోసం సౌర శక్తితో పనిచేసే మానవరహిత పడవను రూపొందించారు. ఈ మానవరహిత పడవ భారత సముద్ర సరిహద్దును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు. ఈ సౌరశక్తితో పనిచేసే పడవ, సముద్రం ముందు ఉన్న ప్రతి కదలికను నిశితంగా పరీక్షిస్తుంది. ఈ బోట్ అనేక అధునాతన పరికరాలతో అమర్చారు. ఇది సముద్ర ఉపరితలం నుండి దాని లోతును కొలవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా సముద్ర ఉపరితలం క్రింద కూడా ఏదైనా కదలికలు ఉంటే పర్యవేక్షణ బృందానికి ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తుంది.
సర్వే కోసం నిర్మించిన ఈ పడవలో జిపిఎస్, బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్, 360 డిగ్రీ కెమెరా, లిడార్ వంటి ఆధునిక పరికరాలు ఉన్నాయి. సర్వే బోట్ యొక్క మొదటి విజయవంతమైన టెస్ట్ చెన్నైలోని కామరాజర్ పోర్టులో జరిగింది. తరువాత కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో క్లిష్ట పరిస్థితుల్లో దీనిని పరీక్షించనున్నారు. సర్వే కోసం ఈ పడవను ఐఐటి మద్రాసులోని జలమార్గాలు, ఓడరేవులు, తీరాల విభాగం పరిశోధకులు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు.
ఈ స్వయంప్రతిపత్తి సర్వే పడవను అభివృద్ధి చేయడంలో ప్రధాన ప్రభావాన్ని చూపిస్తూ, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్, కె. మురళి మాట్లాడుతూ, “భారత సముద్ర రంగం యొక్క స్వదేశీకరణకు ఇది ఒక ముఖ్యమైన దశ, ప్రస్తుతం ఈ ప్రాంతం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆధిపత్యం చెలాయిస్తుంది.” ఈ పడవ చాలా లోతుఎక్కువగా ఉన్న నీటిలో కూడా లోతును ఖచ్చితంగా కొలుస్తుంది. ఫెర్రీ పోర్టు వద్ద పెద్ద ఓడరేవుల కదలికను భద్రపరచడంలో, ఓడలలో గరిష్ట సురక్షిత బరువును నిర్ధారించడంలో ఈ సర్వే బోట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సముద్ర మార్గానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందని, తద్వారా ఓడల కదలిక అంతరాయం లేకుండా కొనసాగవచ్చని ఆయన తెలిపారు. దీనిని నదులు, ఓడరేవులు, ఆనకట్టలు, సరస్సులు మొదలైన వాటిలో ఎక్కడైనా ఉపయోగిచుకునే విధంగా తయారు చేశారు. ఇది అలల తీవ్రతను కూడా ఖచ్చితంగా తెలుపుతుంది. అంతేకాకుండా ఇది రిమోట్ సహాయంతో నడిచే మానవరహిత పడవ. దీనికి శక్తిని అందించడానికి ఇందులో సోలార్ ప్లేట్స, బ్యాటరీ సెట్లను ఏర్పాటు చేశారు. ఇది నీటి ఉపరితలంపై దాదాపు 5 గంటలు తేలుతూ ఉంటుంది. ఏది ఏమైనా పెరుగుతున్న టెక్నాలజీ కాలంలో ఇది చాలా ఉపయోగకరంగా చెప్పవచ్చు.