Ramdev Baba Vs IMA: అలోపతి వైద్యం మీద ఆ కోవకు చెందిన వైద్యులపైనా యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యల పైన ఆయనతోనే బహిరంగ చర్చకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ )సిద్ధపడింది.మీడియా సమక్షంలో ఈ బహిరంగ చర్చను నిర్వహించటానికి ఐఎమ్ఏ సిద్ధంగా ఉందని ఆ సంస్థ ఉత్తరాఖండ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ ఖన్నా తెలిపారు.
రామ్ దేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ పతంజలి యోగపీఠ్ కు చెందిన అర్హతలు,రిజిస్ట్రేషన్ కలిగిన ఆయుర్వేద వైద్యులను తీసుకొచ్చి ఈ బహిరంగ చర్చలో పాల్గొనాలని కోరుతూ ఆయన నేరుగా యోగా గురు కు శుక్రవారం లేఖ రాశారు. నిష్ణాతులైన ఐఎంఎ వైద్య బృందం కూడా ఈ చర్చలో పాల్గొంటుందని ఎదురెదురుగానే అన్ని విషయాలు తేల్చుకుందామని డాక్టర్ అజయ్ ఖన్నా తన లేఖలో పేర్కొన్నారు.మీరే తేదీ, సమయం, ప్రదేశం నిర్ణయించుకొని తెలియజేస్తే ఐఎంఏ వైద్య బృందం అక్కడికి వచ్చి బహిరంగ చర్చలో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు.దీంతో యోగా గురు బాబా రాందేవ్ ఐఎంఏ ల మధ్య గత పది రోజులుగా సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది.
అంతకుముందు ఏం జరిగిందంటే?
అల్లోపతి వైద్యుల మధ్య సాగుతున్న వివాదం ఒక ధారావాహిక సీరియల్ ను తలపింపజేస్తోంది. ఈ మధ్యే ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అల్లోపతి వైద్యాన్ని ఆ కేటగిరీ వైద్యులను ఆయన తీవ్రంగా విమర్శించారు.అల్లోపతి వైద్యం వల్లనే కరోనా రోగులు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.రెమడిసీవరు లాంటి ఇంజక్షన్లు సైతం కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి అన్నారు.అల్లోపతి వైద్యం చేసే డాక్టర్ల మీద కూడా నోరు పారేసుకున్నారు. అంతకు ముందొక సందర్భంలో అల్లోపతి డాక్టర్లు ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు. దీనిపై ఐఎంఏ స్పందించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్కు ఫిర్యాదు చేశాక ఆయన దిగొచ్చినట్లు కనిపించారు .కేంద్రమంత్రి సూచన మేరకు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.కానీ పక్కరోజే మళ్లీ తన ధోరణి ప్రదర్శించారు. ఈసారి ఏకంగా అల్లోపతి వైద్యులకు ఇరవై అయిదు ప్రశ్నలు వేశారు.అల్లోపతి వైద్యం దేనికి పనికిరాదన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.దీంతో మళ్లీ వివాదం రాజుకుంది.ఉత్తరాఖండ్ ఐఎంఏ శాఖ ఆయనపై వెయ్యికోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీస్ కూడా ఇచ్చింది.
ప్రధానికి ,పోలీసులకు ఫిర్యాదు!
అంతేగాక ఐఎంఎ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయీష్ లిలే గురువారం నాడు ఐపీ ఎస్టేట్ పోలీస్స్టేషన్లో రామ్దేవ్ మీద దేశద్రోహం నేరం కింద ఫిర్యాదు చేశారు.కరోనా దేశంలో తీవ్రంగా వ్యాపించిన నేపథ్యంలో అల్లోపతి వైద్యం మీద, ఆ కేటగిరికి చెందిన వైద్యుల మీద ,కరోనాకు ఉపయోగించే ఇంగ్లీషు మందుల మీద రామ్ దేవ్ చేస్తున్న వ్యాఖ్యలు భారత దేశ పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా ఉన్నాయని ఇది దేశద్రోహం నేరం కిందకు వస్తుందని ఆయన తన పధ్నాలుగు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కి కూడా ఐఎమ్ఏ లేఖ పంపింది.దేశ పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన తరుణం ఇదేనని ఐఎంఏ తన లేఖలో మోడీకి విన్నవించింది.ఇప్పటికే రామ్ దేవ్ మీద జలంధర్ పోలీస్ స్టేషన్లో కూడా ఐఎంఏ చేసిన ఫిర్యాదు పెండింగ్ లో ఉంది.
Read More: Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!
బాబులు దిగివచ్చినా నన్ను అరెస్టు చేయలేరు
ఇదిలావుండగా ఐఎంఏ వైద్యులకు మద్దతుగా సోషల్ మీడియాలో అరెస్టు రామ్దేవ్ అన్న హ్యాష్ ట్యాగ్ తో ఉద్ధృత ప్రచారం మొదలైంది.దీనిపై రాందేవ్ తీవ్రంగా స్పందించాడు .ఆ డిమాండ్ చేస్తున్న వారి బాబులు దిగివచ్చినా నన్ను అరెస్టు చెయ్యలేరని యోగాగురు వ్యాఖ్యానించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇన్ని పరిణామాల అనంతరం ఐఎంఏ నేరుగా బాబా రామ్ దేవ్ ను బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరింది దానికి యోగాగురు స్పందన ఏమిటన్నది తేలాల్సి ఉంది.