Ramdev Baba: అనుకున్నదే జరిగింది..అల్లోపతి వైద్యంపై, ఆ కోవకు చెందిన డాక్టర్లపై విమర్శల మీద విమర్శలు చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ కి ఐఎంఎ ఉత్తరాఖండ్ శాఖ వెయ్యికోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసు పంపింది.
అల్లోపతి మీద, డాక్టర్ల పైన తాను చేసిన విమర్శలను,ఆరోపణలను ఉపసంహరించుకుంటూ,తమ అందరికీ క్షమాపణలు చెబుతూ రామ్దేవ్ కనుక పదిహేను రోజుల్లో ఒక వీడియోను విడుదల చేయని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.ఐఎమ్ఎ ఉత్తరాఖండ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ ఖన్నా ఈ నోటీసు ఇచ్చారు.అంతేగాకుండా రామ్దేవ్ వ్యవహారశైలి పైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు.రామ్ దేవ్ వ్యాఖ్యల కారణంగా వైద్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ,డ్యూటీలు చేయడానికి కూడా సిద్ధంగా లేరని అజయ్ ఖన్నా సీఎం దృష్టికి తెచ్చారు.
అంతకుముందు ఏం జరిగిందంటే !
ఈ మధ్యే బాబా రాందేవ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అల్లోపతి వైద్యాన్ని ఆ కేటగిరీ వైద్యులను ఆయన తీవ్రంగా విమర్శించారు.అల్లోపతి వైద్యం వల్లనే కరోనా రోగులు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.రెమడిసీవరు లాంటి ఇంజక్షన్లు సైతం కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి అన్నారు.అల్లోపతి వైద్యం చేసే డాక్టర్ల మీద కూడా నోరు పారేసుకున్నారు. అంతకు ముందొక సందర్భంలో అల్లోపతి డాక్టర్లు ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఐఎంఏ తీవ్రంగా స్పందించి ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ను డిమాండ్ చేసింది.మరోవైపు జలంధర్లో ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.అయితే హర్షవర్ధన్ సకాలంలో జోక్యం చేసుకొని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా రాందేవ్ ను కోరారు.దీంతో యోగా గురు రామ్దేవ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.ఇంతటితో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని అందరూ భావించారు.
Read More: RRR: ఇండియాలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో “RRR” ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..??
Ramdev Baba: అంతటితో ఆగితే ఆయనెందుకు రామ్దేవ్ అవుతారు?
ఆదివారం నాడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు బాబా రామ్దేవ్ సోమవారంనాడే అల్లోపతి వైద్యులను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ వదిలాడు.ఈసారి వారికి ఆయన ఇరవై అయిదు ప్రశ్నలు వేశాడు. బిపి షుగర్ వ్యాధులను అసలు అల్లోపతి వైద్యం పూర్తిగా నయం చేయగలదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.అలాగే ఆర్థరైటిస్ ,థైరాయిడ్,ఆస్తమా వంటి వ్యాధులను నయం చెయ్యడానికి అసలు మందులు ఉన్నాయా అని ఆయన నిలదీశారు.ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొలెస్ట్రాల్ కి హృదయ సంబంధ వ్యాధులకు మీ దగ్గరున్న చికిత్సా విధానం ఏమిటని రామ్ దేవ్ అడిగారు.చివరకు మలబద్ధక వ్యాధినైనా ఏ మందైనా పూర్తిగా నయం చేస్తుందా అని ఆయన సెటైర్ విసిరారు.ఇలాగే పలు వ్యాధులను ప్రస్తావించిన రాందేవ్ చివరగా వైద్యులపై పంచ్ డైలాగ్ వేసారు.అల్లోపతి వైద్యం అంత శక్తివంతమైనది అయితే… వైద్యులు సర్వగుణ సంపన్నులైతే వారు ఏ జబ్బు బారిన పడబోరన్నారు. ఇదే మరో కొత్త వివాదానికి దారితీసి బుధవారం ఆయనకు లీగల్ నోటీస్ ఇచ్చేటంతవరకూ వెళ్లింది.