ఈ రోజుల్లో పేలవమైన జీవనశైలి వల్ల చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. యుక్త వయసులో ఉన్నవారు కూడా మధుమేహం కోరల్లో చిక్కుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రెట్టింపు అవుతున్నారు. అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాగా మధుమేహంపై అవగాహన కల్పించేందుకు నవంబర్ 14న ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అవగాహన మాత్రమే కాదు, జీవనశైలిలో మార్పులు కూడా ముఖ్యం. 1922లో చార్లెస్ బెస్ట్తో కలిసి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జయంతి సందర్భంగా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
టైప్ 1 డయాబెటిస్
సాధారణంగా మన శరీరంలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ జబ్బు వచ్చినవారు టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్ తీసుకుంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
టైప్ 2 డయాబెటిస్
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారి శరీరంలోని కణాలు ఇన్సులిన్కు స్పందించవు. ఇది ముదిరిన కొద్దీ ఇన్సులిన్ లోపం కూడా సంభవిస్తుంది. ఇంతకు ముందు దీనిని నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ (NIDDM) లేదా అడల్ట్ ఆన్సెట్ డయాబెటిస్ అని పిలిచేవారు. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. హెల్దీ ఫుడ్, వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని అధిగమించడానికి రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవడం తప్పనిసరి.
టైప్ 2 మధుమేహం ఇన్సులిన్ సహాయం లేకుండా మందులతో తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కొన్ని మందులు నోటి ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఈ వ్యాధిని వదిలించుకోవడానికి బరువు తగ్గడం కూడా రోగులకు అత్యవసరంగా మారుతుంది.
లావుగా మాత్రమే కాదు సన్నగా ఉన్నా డేంజరే!
సన్నగా ఉన్నావారికి కూడా ఈ వ్యాధి వస్తోంది. కొవ్వు ఎక్కువగా తీసుకొని వారు, శారీరక శ్రమ విపరీతంగా చేస్తున్న వారికి కూడా డయాబెటిస్ వస్తోంది. వాయు కాలుష్యం కూడా మధుమేహానికి దారితీస్తోంది. జబ్బు ఒక్కసారి వస్తే దీన్ని నియంత్రించుకోవడానికి జీవితాంతం కష్టపడాలి. కాబట్టి దీనిని ముందుగానే నివారించడం చాలా మంచిది అందువల్ల పైన చెప్పిన జాగ్రత్తలను అందరూ తప్పక పాటించాలి.