ఢిల్లీ, మార్చి 4: నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తెలిపారు. ఎవరైతే కాశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించి ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పుతారో వారే ఈ పురస్కారానికి అర్హులని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను భారత్ కు అప్పగించటంతో పాకిస్థానీలు తమ ప్రధాని శాంతిని కోరుకునే వ్యక్తని కొనియాడుతూ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌద్రీ ఇమ్రాన్ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని శనివారం ఆ దేశ పార్లమెంట్లో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.
‘ఇమ్రాన్ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’ అని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
సోమవారం ఈ తీర్మానంపై చర్చ జరుగుతుందనీ, ఇమ్రాన్ పార్టీకి మెజార్టీ ఉండటంతో తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ ఇమ్రాన్ తాను నోబెల్ పురస్కరానికి అనర్హుడినని ట్వీట్ చేశారు.