పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ అట్టుడికిపోయింది. ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. లాహోర్ లోని ఆర్మీ కమాండర్ కార్యాలయంలోకి నిరసనకారులు ప్రవేశించారని పాక్ మీడియా పేర్కొంది. అదే విధంగా రావల్పిండిలో పాకిస్థాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోకి నిరసనకారులు చొచ్చుకుపోయారని తెలిపింది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, ముర్దాన్ తో పాటు దేశ వ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
పాక్ లోని క్వేట్టాలో ఆందోళనలు హింసాత్మకంగా మరాయి. అక్కడ ప్రాంతాలు అట్టుడికిపోయాయి. దీంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులను అదుపు చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు గాయపడ్డారు. కరాచీలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. వీధిలైట్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. పిటీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పాకిస్థానీయులు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని కోరింది. ప్రజలు దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది .ప్రపంచ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇమ్మాన్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇమ్మాన్ ను అరెస్టు చేసి తీసుకువెళుతున్న వీడియోలను, పోటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై పాక్ ప్రభుత్వం స్పందించింది. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కు భూమి కేటాయింపునకు సంబంధించి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పాక్ హోం మంత్రి రాణా సవావుల్లా తెలిపారు. ఈ ట్రస్ట్ ఆయన భార్య బుష్రా బీబీ, స్నేహితురాలు ఫరా గోగి పేరుతో ఉందన్నారు. ఇమ్రాన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సొమ్ము తిరిగి ప్రభుత్వానికి ఇప్పించాలని కోర్టును కోరనున్నట్లు వెల్లడించారు. పాక్ రేంజర్లు ఇమ్రాన్ ను హింసించినట్లు వచ్చిన ఆరోపణలను పాక్ మంత్రి రాణా తోసిపుచ్చారు. మరో పక్క ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ను సవాల్ చేస్తూ దాఖలపైన పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు ఆగమేఖాల మీద విచారణ జరిపింది. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను దష్టిలో ఉంచుకుని భారత రక్షణ శాఖ అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బలగాలు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.