(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రంలో ఒక హిందూ మహిళ పోలీసు ఆఫీసర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇలా ఒక హిందూ మహిళ పోలీసు అధికారి కావడం ఇదే మొదటిసారి. పుష్పా కొల్హి అనే యువతి రాష్ట్ర పోటీ పరీక్షలు రాసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంపాదించుకున్న విషయాన్ని జియో న్యూస్ ఛానల్ రిపోర్టు చేసింది. మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
గత జనవరిలో సుమన్ పవన్ బోదానీ అనే హిందూ మహిళ మొదటిసారిగా సివిల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. సింధ్ రాష్ట్రంలో బాగా వెనుకబడిన మారుమూల ప్రాంతంలో ఒక పేద కుటుంబం నుంచి తాను వచ్చినట్లు బోదానీ బిబిసి ఉర్దూ ఛానల్కు చెప్పారు.
పాకిస్థాన్లో హిందువులు అతి పెద్ద మైనారిటీ గ్రూపు. సుమారుగా 75 లక్షల మంది ఉంటారు. వీరిలో అత్యధికులు సింధ్ రాష్ట్రంలోనే ఉన్నారు.