ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయ నిధి నుండే నకిలీ చెక్కుల ద్వారా ఏకంగా రూ.117 కోట్లు దోచేందుకు ఒక ముఠా విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులు, సూత్రధారులు ఎవరు ఉన్నారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కేసును ఏ సి బీ, సీ ఐ డీ విచారణకు ఆదేశించడం ఆ వెంటనే అధికారులు రంగంలోకి కొందరు ముఠాగా ఏర్పడి ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో పాత్రధారులైన కొందరిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కొంత కీలక సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్రపైనా విచారణ జరుపుతున్నారు.
ప్రధానంగా నకిలీ చెక్కుల ద్వారా సీఎంఆర్ఎఫ్ నిధులు కైంకర్యం చేస్తున్న ముఠాకు వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది, అదే విధంగా సచివాలయంలో పని చేసే కొందరు ఉద్యోగులు కూడా సహకారం అందించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ప్రొద్దుటూరులోనూ నకిలీ సీఆర్ఎఫ్ చెక్కులతో రూ,25లక్షలకుపైగా నిధులు డ్రా చేసిన విషయం వెలుగులోకి రావడంతో ముగ్గురిని అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారి పోలీసులకు లొంగిపోయాడు.
మరో పక్క నకిలీ చెక్కుల కుంభకోణంపై విచారణ జరుపుతున్న అధికారులకు నకిలీ బిల్లుల వ్యవహారం కూడా బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహరంలో ఆరుగురు నిందితులను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఏపి ఏసీబీ అధికారుల సమాచారంతో దక్షిణ కర్నాటక పోలీసులు వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను ఏసీబీ అధికారులు విచారించగా పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం. నకిలీ చెక్కుల మార్పిడి రాకెట్ లో సచివాలయంలో పని చేసే కొందరు సిబ్బంది, ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు ప్రాధమికంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఏసిబి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నకిలీ చెక్కుల కుంభకోణంతో పాట నకిలీ బిల్లుల స్కామ్ పైనా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏసీబీ అదికారుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తుండటంతో ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే ఉద్యోగుల్లో, సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.