(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారతదేశంలో కరోనా (కోవిడ్ 19) విజృంభణ తగ్గుముఖం పట్టలేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు లక్ష చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ భారత దేశంలో 48,46,427 కేసులు నమోదు కాగా 79,722 మంది కరోనాతో మృతి చెందారు. 37,80,107 మంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుండి కోలుకోగా 9,86,598 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి అదుపునకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాగా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటూ పుకార్లు షికారు చేశాయి కానీ వ్యాక్సిన్ మాత్రం మార్కెట్లోకి విడుదల కాలేదు. వ్యాక్సిన్ తయారీ క్లినికల్ ట్రయిల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యల బట్టి అర్థం అవుతోంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం లో కోవిడ్ 19 వ్యాక్సిన్ వస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు.ఆయన సోషల్ మీడియాలో “సండే సంవాద్” కార్యక్రమంలో భాగంగా తన ఫాలోవర్లతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అక్స్ఫర్డ్ యూనివర్శిటీ, అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన తరువాతే సీరమ్ ఇనిస్టిట్యూట్లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. వ్యాక్సిన్ భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా ఉండేందుకు తానే మొదటి డోసు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు హర్షవర్థన్. వ్యాక్సిన్ వచ్చిన తరవాత ముందుగా అత్యవసరమైన వారికే ఇస్తామని ఆయన వివరించారు. సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వ్యాక్సిన్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని వారికి కూడా వ్యాక్సిన్ అందించే విధంగా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.