తిరువనంతపురం, జనవరి 15: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని వచ్చిన ప్రధమ మహిళ కనకదుర్గ (39)పై అత్తింటి వారు నేడు దాడికి పాల్పడ్డారు. శబరిమల ఆలయం వద్ద గత కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
అన్ని వయస్సుల మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చని సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది మహిళలు స్వామిని దర్శించుకునేందుకు ప్రయత్నించారు.
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందిన కనకదుర్గ హిందూ సంఘాల బెదిరింపులతో దాదాపు రెండు వారాల పాటు అజ్ఞాతంలో ఉండి మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకుంది. ఆమెపై అత్త, భర్త విరుచుకుపడ్డారు. ‘తాము వెళ్లవద్దని వారించినా వినకుండా స్వామిని దర్శించుకోవడానికి ఎందుకు వెళ్లావంటూ’ ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. ఆమెకు బలమైన గాయం కావడంతో తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
బిందు అనే మహిళతో కలిసి ఈ నెల రెండవ తేదీ కనకదుర్గ పోలీస్ భద్రత నడుమ అయ్యప్పను దర్శించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్త, భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.