శివకేశవుల క్షేత్రంగా విరాజిల్లుతున్న శబరిమలకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టి శబరిమలకు వస్తుంటారు. తిరుపతి లడ్డూకు ఎంత ప్రాధాన్యం ఉందో అయ్యప్పస్వామి “అరవణి” ప్రసాదానికి అంతే ప్రాముఖ్యత ఉంది.. మీకు శబరిమల అరవణ ప్రసాదం అంటే ఇష్టమా..? కరోనా మహమ్మారి కారణంగా ఈసారి శబరిమల నుంచి ప్రసాదం తెప్పించుకోలేమని అనుకుంటున్నారా..? కరోనా మహమ్మారి నేపధ్యంలో భక్తులకు అయ్యప్పస్వామి ప్రసాదాన్ని ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు-టీడీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రసాదం కోసం భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. కేరళలోని ప్రాంతాలకు రెండు రోజుల్లో, ఇతర రాష్ట్రాలకు ఏడు రోజుల్లోగా అయ్యప్పస్వామి ప్రసాదాన్ని భక్తులకు చేరుస్తామని టీబీడీ చైర్మన్ వివరించారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య భారీగా తగ్గిందనేది వాస్తవం. ఎవరైనా శబరిమల వెళ్తున్నారంటే ప్రసాదం తీసుకురమ్మని చెప్పేవారిని చూస్తుంటాం. శబరిమలలో దొరికే అరవణ పాయసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ. ఈసారి కరోనా వైరస్ సంక్షోభంతో శబరిమలకు ఎక్కువ మంది భక్తులను అనుమతించట్లేదు. ప్రతీ రోజు 1000 మంది భక్తులకు, వారాంతాల్లో 2000 మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు.
సాధారణంగా అయితే రోజూ లక్షల్లో భక్తులు శబరిమల వెళ్లేవారు. ఆలయానికి అనుమతించే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. దీంతో ఈసారి అరవణ పాయసం రుచి చూసే అవకాశం లేకుండా పోతోందని అయ్యప్ప భక్తులు బాధపడ్డారు. వారికి భారతీయ తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఇంటికే ప్రసాదాన్ని డెలివరీ చేస్తామని ప్రకటించింది. శబరిమల అరవణ ప్రసాదం హోమ్ డెలివరీ స్కీమ్ను ప్రారంభించింది తపాలా శాఖ. శబరిమల నుంచి ప్రసాదం నేరుగా భక్తుల ఇంటికే చేరుస్తోంది. వారం క్రితమే డెలివరీ మొదలైంది. దేశంలో ఎక్కడికైనా ప్రసాదాన్ని హోమ్ డెలివరీ చేయనున్నారు. భక్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం దేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కూడా శబరిమల ప్రసాదాన్ని తెప్పించుకోవాలంటే మీకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసుకి వెళ్తే చాలు. వారం రోజుల్లోపే ప్రసాదం ప్యాకెట్ మీ ఇంటికి వస్తుంది. శబరిమల అయ్యప్ప ప్రసాదం ధర రూ.450. ఇందులో కేవలం ప్రసాదం మాత్రమే కాదు ప్రసాదం కిట్ ఉంటుంది. అందులో అరవణ పాయసం, విభూతి, కుంకుమ, పసుపు, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. ఈ మొత్తం కిట్ ధర రూ.450. ఒకరు ఒకే రిసిప్ట్పై 10 వరకు ప్రసాదం కిట్స్ని ఆర్డర్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో రిసిప్ట్ పైన బుక్ చేయాలి. ఒకరు ఎన్ని ప్రసాదం కిట్స్ అయినా బుక్ చేయొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు.