YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో విధాలుగా పేద ప్రజలకు ఎంతో చేస్తున్నప్పటికీ కరోనా కష్టకాలంలో కూడా నిరుపేదలకు ఆహారం సమకూర్చకపోవడం వైసిపి ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ ప్రభుత్వం నవరత్నాల అమలులో మాత్రం వెనుకంజ వేయకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఏ వర్గానికి ఇవ్వాల్సిన సాయాన్ని ఆ వర్గాలకు ఇచ్చేస్తోంది.గురువారం నాడు కూడా వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేసేసింది.ఇదంతా బాగున్నప్పటికీ కరోనా ఆంక్షలు, కర్ఫ్యూ కారణంగా అనేక మంది పేదలు పట్టెడు అన్నానికి నోచుకోవడం లేదు.అలాంటి వారిని గుర్తించి ఆహారం అందించే ఏర్పాట్లు రాష్ట్రంలో జరగలేదు.చంద్రబాబునాయుడు హయాంలో ఐదు రూపాయలకే పేదలకు ఆహారం అందిస్తున్న అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం ఎత్తేసింది.ఆ తదుపరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయలేదు.అవి కొనసాగి ఉన్నా ఇప్పుడు పేదలకు ఆహారానికి కొరత ఉండేది కాదు.ఈ విషయం లోమాత్రం జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పాలి.ఈ సందర్బంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో ఏపీని పోల్చాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఏం జరుగుతోందంటే?
కొవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజూ 45 వేల మందికి భోజన సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్తక వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు మూసివేయడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుత లాక్ డౌన్ లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలను తెరచి అవసరమైన వారికందరికి అన్నపూర్ణ భోజనాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు అదనంగా 100 అన్నపూర్ణ కేంద్రాలు నగరంలో ప్రారంభ మయ్యాయి. మొత్తం 250 కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 45 వేల మందికి అన్నపూర్ణ భోజనం అందిస్తున్నారు.ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకుంటే ఇంతవరకు జగన్ సర్కారు చేసిన మంచి కార్యాలన్నీ నిరుపయోగంగా మారిపోగలవు