యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. హాలీవుడ్ హీరో టాలీవుడ్ లో ఉన్నాడని పెద్ద పెద్ద వాళ్ళే ప్రశంసిచారు. ప్రస్తుతం ఏ నిర్మాణ సంస్థ అయినా సరే ప్రభాస్ తో సినిమా నిర్మించాలంటే పాన్ ఇండియన్ రేంజ్ లో కథ ఉండాలి. 300 కోట్ల పైనే బడ్జెట్ కేటాయించాలి. ఇక ప్రభాస్ హీరో అంటే అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాల్సిందే. బాలీవుడ్ నటీ నటులు, హాలీవుడ్ టెక్నీషియన్స్ సినిమాకి పని చేయాలి.
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా సిద్దం చేశారు. గోపికృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు ఆదిపురుష్ టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని హాలీవుడ్ లోను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అసాధారణమైన క్రేజ్ ని సాధించిన ప్రభాస్ ప్రస్తుతం కమిటయిన మూడు ప్రాజెక్ట్స్ తో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరో ఇప్పట్లో సాధించలేని రేంజ్ కి వెళ్ళాడని అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో ఉన్న ఖాన్ ల త్రయం నుంచి అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో వరకు ఎవరు ఈ రేంజ్ ని అందుకోలేరని చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరు ప్రభాస్ ని టార్గెట్ గా పెట్టుకొని తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారట.